జగన్ మైండ్గేమ్, ఐనా ఇప్పటికీ నో చెప్పిన చిరంజీవి!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టిడిపితో పాటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రధాన ప్రత్యర్థి అని, దానిని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ రెండు పార్టీల్ని విమర్శించినప్పుడే తమ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని, దాంతో పాటే తమకు మైలేజ్ వస్తోందని గ్రహించిందని అంటున్నారు.
టిడిపిని మాత్రమే విమర్సించి, విపక్షంలో ఉన్న వైసిపి ప్రతిపక్షంగా విఫలమైందని విమర్శించకుంటే అది మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. వైసిపిని ఏమనకుంటే అది తమ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలకు కూడా అవకాశమిస్తోందని భావిస్తోందని తెలుస్తోంది.
వైసిపిలో తమ పార్టీ నేతలను చేర్పించుకునేందుకు జగన్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ జగన్ పార్టీ వైపు వెళ్లింది.
ఈ తరుణంలో అదే ఓటు బ్యాంకు లక్ష్యంగా మరింత ప్రణాళికతో వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని చెబుతదున్నారు. ఓ వైపు జగన్ వైపు ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటూనే, టిడిపి వైపు మళ్లిన కాపు సామాజిక వర్గాన్ని కూడా తమ వైపు రప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పే విషయమై ఎంపీ చిరంజీవికి అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయంటున్నారు. అయితే, ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా బిజీలో ఉన్నారు. దీంతో ప్రస్తుతానికి అధిష్టానానికి ఈ విషయం చెప్పి, దానిని పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి చెందిన మద్దతు పలికిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను తమ వైపుకు తిప్పుకోవాలని కొందరు సూచించినప్పటికీ.. అది సాధ్యం కాదని మరికొందరు భావిస్తున్నారని తెలుస్తోంది.