జగన్కు పవన్ కల్యాణ్ తలనొప్పి: మార్కులు తక్కువేనా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఓ వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యాఖ్యానిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అంటూ ఆ ప్రభుత్వ వ్యతిరేకత వైయస్ జగన్కు ఉపయోగపడుతుందని చెప్పలేమని అన్నారు.
ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఆశించిన స్థాయిలో లేరని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్కు తక్కువ మార్కులు పడుతాయనే అభిప్రాయం కూడా అందులో ఉంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి వైయస్ జగన్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను తన వైపు తిప్పుకునే స్థాయిలో జగన్ వ్యూహాలు, కార్యాచరణ లేవా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దానికితోడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైన సమస్యలపై ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ జగన్ విస్తరణకు ఆటంకం కలిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
మోడీ ప్రభుత్వంపై సుతిమెత్తగా వ్యవహరించడం
ప్రత్యేక హోదా వంటి పలు అంశాలపై వైయస్ జగన్ చంద్రబాబును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడానికి వెనకాడుతున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. కేసులకు భయపడే ఆయన మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి భయపడుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
పవన్ కల్యాణ్తో ఇలా ఇబ్బంది...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్పై ప్రత్యక్ష సమరమేమీ ప్రకటించడం లేదు. కానీ, జగన్ తనకు అనుకూలంగా మలుచుకుందామని ప్రయత్నించిన ప్రతి అంశాన్నీ ఆయన హైజాక్ చేస్తున్నారు. అమరావతి భూముల స్వాధీనం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మెగాపుడ్ వ్యవహారం దాకా ఇప్పటిదాకా సాగింది అదే. పవన్ కల్యాణ్ను ఎదుర్కోవడానికి జగన్ వద్ద అస్త్రాలేవీ ఉన్నట్లు లేవు.
అధికారం కోసమే చేస్తున్నారనే...
చంద్రబాబును గద్దె దించి తాను అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలనే తాపత్రయం, ఆరాటమే ఎక్కువగా జగన్లో కనిపిస్తోందనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాలు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయనకు ఆశించినంత మేర మద్దతు లభిస్తుందా అనేది అనుమానంగానే ఉంది.
సీనియర్లు లేకపోవడంతో....
పార్టీలో సీనియర్లు లేకపోవడం, ఉన్న సీనియర్లు ఒక్కరొక్కరే జారిపోవడం కూడా జగన్కు ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా, తమ సలహాలను జగన్ వినలేదనే విమర్శలు పార్టీ నుంచి వెళ్లిపోయిన సీనియర్లు అంటున్నారు. దానివల్ల కూడా జగన్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదనే అభిప్రాయం ఉంది.
వారు ముగ్గురే ఉన్నారు...
జగన్కు మద్దతుగా ఉంటూ పెద్ద గొంతుతో చంద్రబాబుపై, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నవారు ముగ్గురే ఉన్నారు. రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే బలమైన వాణిని వినిపిస్తున్నారు. వారికి అనుభవం లేకపోవడం, ఆ ముగ్గురిని కూడా చంద్రబాబు ఏదో రకంగా ఆత్మరక్షణలో పడేయడానికి ఎప్పుటికప్పుడు ప్రయత్నించడం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సమస్యగానే ఉంది.
చంద్రబాబు అనుభవం ముందు జగన్...
చంద్రబాబు అనుభవం ముందు జగన్ అనుభవం సరిపోవడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. జగన్ చంద్రబాబుపై విమర్శలు చేసిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు మూకుమ్మడిగా ఎదురుదాడికి పూనుకుంటున్నారు. జగన్ను ఎదుర్కోవడానికి చంద్రబాబు తయారు చేసిన యంత్రాంగం బలంగా ఉందని చెప్పడానికి ఇది కూడా నిదర్శనం.
జగన్కు ఆత్మవిశ్వాసం ఎక్కువ...
పార్టీలో ఎవరు ఉన్నా, లేకపోయినా తనకున్న ప్రజాబలం, తనకున్న మద్దతు పార్టీకి ఉపయోగపడుతుందని, నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ భావిస్తున్నట్లున్నారు. దానికితోడు, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజాకర్షక పథకాలు తనకు ఉపయోగపడుతాయని, వైయస్ ప్రజాభిమానమే తనకు కొండంత అండ అని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తానొక్కడే అయి జగన్...
పార్టీ నాయకులకు గానీ శాసనసభ్యులకు గానీ మార్గనిర్దేశం చేయడంలో జగన్ విఫలమవుతున్నారనే మాట వినిపిస్తోంది. వారికి ఆయన అందుబాటులో ఉండరనే భావన కూడా బలంగానే ఉంది. తాను చెప్పిందే నాయకులు చేయాలి తప్ప మరో మాటకు తావు ఉండదని అంటున్నారు. దానివల్ల ఎక్కువ మంది నాయకులు గమ్మున ఉండిపోవడాన్ని అలవాటు చేసుకున్నారని చెబుతారు.
నారా లోకేష్నే చూపించే వ్యూహం..
చంద్రబాబు నాయుడి స్థాయికి జగన్ సరిపోరని తెలుగుదేశం పార్టీ నాయకత్వం జగన్ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. జగన్కు నారా లోకేష్ను పోటీ పెడుతోంది. దానివల్ల నారా లోకేష్ స్థాయి మాత్రమే జగన్ది గానీ చంద్రబాబు స్థాయి కాదని చెప్పడానికి ప్రయత్నిస్తోంది.