మూతపడుతుంది: వైసిపిపై సోమిరెడ్డి, ఎదురు చూస్తున్నారన్న జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మూతపడుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోష్యం చెప్పారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ నేరస్తులేనని అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ఉండే అర్హత లేదని సోమిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై యూపిఏ హయాంలోనే కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ప్రజలు ఎదురుచూస్తున్నారు: వైయస్ జగన్
రుణమాఫీపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోమోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో వైయస్ జగన్ పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు, డ్వాక్రా మహిళలు తమ కోసం మనం చేసే పోరాటం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని పార్టీ నేతలతో అన్నారు. వారి పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దామని చెప్పారు.
ఐకేపీ ఉద్యోగులు, అంగన్వాడీల సమస్యలు, ఇసుక మాఫీయా, హుధుద్, శ్రీశైలం జల వివాదం, పోలవరం, రాజధాని అంశం, రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ నేతలతో చెప్పారు. అసెంబ్లీలో మన పోరాటం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. సమస్యలపై పార్టీ ఎమ్మెల్యేలంతా సిద్ధమై సమావేశాలకు రావాలని సూచించారు.