1947 ఆగష్టు 15వ రోజునే ఎందుకు? ఆ తేదీతో లార్డ్మౌంట్బాటెన్కు సంబంధం ఏంటి..?
1947 ఆగష్టు 15న అఖండ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. అయితే ఆగష్టు 15నే బ్రిటీష్ వారు ఎందుకు స్వాతంత్ర్యం ప్రకటించారు.. భారత దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించాలని 1947 జూన్లోనే భావించినప్పటికీ ఆగష్టు నెల వరకు ఎందుకు వేచిచూశారు..? ఆరోజుకు ఏమైనా ప్రత్యేకత ఉందా..? లార్డ్ మౌంట్బాటెన్కు ఆగష్టు 15వ తేదీతో ఉన్న అనుబంధం ఏమిటి.. అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఆగష్టు 15నే ఎందుకు ఎంచుకున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అధికార బదిలీలో కీలకంగా లార్డ్ మౌంట్బాటెన్
1947 ఆగష్టు 15న భారతదేశానికి బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించింది. అయితే అధికార మార్పిడి ప్రక్రియ అంత సులభంగా జరగలేదు. ఎన్నో చర్చల తర్వాత ఏకాభిప్రాయం కుదిరాకే భారత్కు చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బ్యాటెన్ ఆగష్టు 15న భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించాలని భావించారు. అంతకుముందు చాలామంది భారతీయ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఫిబ్రవరి 1947లో లార్డ్ మౌంట్బ్యాటెన్ భారత్కు వచ్చారు. అధికార మార్పిడి ప్రక్రియలో ఈయన కీలకంగా వ్యవహరించారు.
అప్పటికే క్షీణించిన బ్రిటీషర్ల ఆర్థిక పరిస్థితి
ఇక అసలు విషయానికొస్తే గాంధీజీ ఇచ్చిన పిలుపుతో అప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఓ వైపు గాంధీ సైన్యం ఉండగా మరో వైపు సుభాష్ చంద్రబోస్కు చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నుంచి ముప్పు ఉంటుందని బ్రిటీషర్లు భావించారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసే నాటికి బ్రిటీషర్ల ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయింది. వారి దేశాన్ని పాలించేందుకే వారు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక 1945లో బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో భారత దేశ నాయకులు లేబర్ పార్టీ నాయకులతో మంచి సంబంధాలు నెరిపారు. తాము అధికారంలోకి వస్తే భారత్కు స్వాతంత్ర్యం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
జూన్ 3 మౌంట్బాటెన్ ప్లాన్ ఏంటి.?
ఇక లార్డ్ వేవెల్ స్వాతంత్ర్యం ప్రకటించేందుకు పలుమార్లు చర్చలు జరిపారు. చివరికి 1947 ఫిబ్రవరిలో లార్డ్ మౌంట్బాటెన్ భారత్కు చేరుకున్నారు. ముందుగా జూన్ 1948నాటికి భారత్కు అధికారం బదిలీ చేయాలని భావించారు. ఈ మేరకు చర్చలు జరిపారు. అప్పటికే ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని జిన్నా పట్టుబడుతుండటంతో ఎంత తొందరగా అధికారం బదిలీ చేస్తే అంత మంచిదని భావించారు లార్డ్ మౌంట్ బాటెన్. లేదంటే దేశంలో మలఘర్షణలు పెరిగే అవకాశం ఉందని భావించారు. దీంతో భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించాలన్న ఆలోచనను ఏడాది ముందుకు జరిపారు. అంటే 1948 నుంచి 1947కు జరిపారు. 1947 జూన్ 3వ తేదీన భారత్కు అధికార బదిలీ చేయడంపై చర్చించారు. ఇక్కడే ప్లాన్ అమలు చేయడంతో "జూన్ 3 మౌంట్ బాటెన్ ప్లాన్" అని చెప్పడం జరిగింది.
ఆగష్టు 15 ఎందుకు..?
ఆగష్టు 15న భారత్కు స్వాతంత్య్రాన్ని ప్రకటించాలన్న ఆలోచన లార్డ్ మౌంట్ బాటెన్దే. ఈ తేదీ అంటే ఆయనకు సెంటిమెంట్ అట. అంతేకాదు ఈ తేదీ చాలా లక్కీ అని కూడా చెప్పారట. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1945 ఆగష్టు 15న జపాన్ లార్డ్ మౌంట్ బాటెన్ ముందు సరెండర్ అయ్యింది. ఆ సమయంలో లార్డ్ మౌంట్ బాటెన్ బ్రిటన్ బలగాలకు కమాండర్గా ఉన్నారు. అందుకే ఆ తేదీ అంటే తనకు ఒకరకంగా సెంటిమెంట్గా చెప్పుకునేవారట. ఇక అర్థరాత్రే ఎందుకంటే ఆగష్టు 15న దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించాలని భావించిన తరుణంలో... దేశంకు అధికారాలు బదిలీ కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిష్యులు మంచి ముహూర్తం కోసం అన్వేషించారు.
జ్యోతిష్యులు ఏం చెప్పారు..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15 ఆగష్టు 1947 మంచి రోజు కాదు. పవిత్రమైన రోజు అంతకంటే కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే లార్డ్ మౌంట్బాటెన్కు జ్యోతిష్యులు ఇతర తేదీలను సూచించారు. కానీ ఆ తేదీలకు మౌంట్బాటెన్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఆగష్టు 15నే భారత్కు స్వాతంత్ర్యం ప్రకటిస్తామని చెప్పారు. దీంతో ఆగష్టు 14 ఆగష్టు 15 మధ్య రాత్రి సూచించారు. అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం కొత్త రోజు అర్థరాత్రి 12 దాటగానే ప్రారంభం అవుతుండగా హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం వేళ కొత్త రోజు ప్రారంభం అవుతుంది.
Recommended Video
అభిజీత్ ముహూర్తంలో స్వాతంత్ర్యం ప్రకటన
ఇక అధికార బదిలీ సందర్భంగా చేసే ప్రసంగాన్ని 48 నిమిషాల్లో ముగించాలని జ్యోతిష్యులు చెప్పారట. దాన్నే అభిజీత్ ముహూర్తంగా పిలిచారు. ఇది ఆగష్టు 14వ తేదీ రాత్రి 11:51 నిమిషాల నుంచి ఆగష్టు 15వ తేదీ తెల్లవారుజామున 12:39 నిమిషాల మధ్య ముగించాలని సూచించారట.ఆ సమయంలోనే నెహ్రూ తన ప్రసంగాన్ని ప్రారంభించి ముగించాల్సి ఉన్నింది. అర్థరాత్రి 12 గంటలకు స్వాతంత్ర్యం ప్రకటన జరగాలని అదే సమయంలో శంఖం పూరించి కొత్త దేశం అవతరించిందని ప్రపంచానికి చాటాలని జ్యోతిష్యులు సూచించారు. ఇక ఇదే జరిగింది. అ తర్వాత చరిత్రలో మిగిలింది.