
పాకిస్థాన్ రికార్డ్ బ్రేక్.. ఒకేసారి 78 వేల జాతీయ జెండాలు.. ఇండియాలో ఎక్కడంటే..
దయాది పాకిస్థాన్.. 18 ఏళ్ల రికార్డును భారత్ బ్రేక్ చేసింది. క్రికెట్లో కాదులెండి. బీహార్ జగదీష్పూర్లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేశారు. పాకిస్థాన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1857 సిపాయిల తిరుగుబాటులో మరణించిన భారత విప్లవ కారుడు వీర్ కన్వర్ సింగ్ 164వ వర్ధంతి సందర్భంగా బిహార్, భోజ్పూర్ జిల్లా, జగదీష్పూర్లో జాతీయ జెండాలను ఎగరవేశారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హాజరయ్యారు. 77 వేల మంది వరకు పౌరులు హాజరయ్యారు. వీరంతా వందేమాతరం ఆలపించారు. అందరూ జాతీయ పతాకాన్ని చేతపట్టి, జెండా గాలిలో ఊపుతూ నినాదాలు చేశారు. ఒకేసారి 75,000 మందికి పైగా పౌరులు జాతీయ పతాకాన్ని చేతితో ఎగరేయడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు దక్కింది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధులు కూడా దీనికి హాజరై, రికార్డును నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరుతో ఉండేది. లాహోర్లో పద్దెనిమిదేళ్ల క్రితం 56,000 మందితో కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడా రికార్డు భారత్ సొంతం అయ్యింది. పాకిస్థాన్ కన్నా.. 19 వేల మంది జనం ఎక్కువగా జెండాలను చేత పట్టుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా నినాదాలు చేస్తూ.. చరిత్రను లిఖించారు.