నయీం ఎన్కౌంటర్తో మారిన సీన్: మంజిల్ వెలవెల, కనిపించని హడావుడి
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం భువనగిరిలోని వ్యాపారులు, ప్రజలు ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. గతేడాది నయీం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నయీం సుమారు రెండు కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
చీటి మీద ఎంత రాస్తే భువనగిరిలోని వ్యాపారాలు అంత ఇవ్వాల్సిందేనని బెదిరించేవాడు. సరిగ్గా నెల రోజుల క్రితం నయీం నేర సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో భువనగిరి వాసులు గణేష్ ఉత్సవాల్లో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత భువనగిరిలో సీన్ ఒక్కసారిగా మారింది.
కానీ ఈసారి చందాలు 15 వేలు కూడా దాటక పోవడం విశేషం. అంతేకాదు భువనగిరిలోని నయీం మంజిల్ వెలవెలబోతుంది. గణేష్ మండపం వద్ద ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. బంధువులు అరెస్ట్తో భువనగిరిలోని నయీం ఇంటికి తాళం వేసి ఉంది. గతేడాది గణేష్ ఉత్సవాలకు పోలీసులు, రాజకీయ వేత్తలు హాజరైన సంగతి తెలిసిందే.
కానీ ఈసారి గణేష్ ఉత్సవాలు సాదాసీదాగా జరుగుతున్నాయి. గణేష్ మండపం వద్ద కేవలం నిర్వహకులు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే నయీం కేసులో విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేసులో పలువురు నయీం అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు మరో పది మందిని అరెస్టు చేశారు.
వీరంతా నల్గొండ జిల్లాలోని భువనగిరిలో కిడ్నాప్ లు, బలవంతపు భూముల రిజిస్ట్రేషన్లు, ఆయుధాల సేకరణ చేశారని సిట్ అధికారులు తెలిపారు. అరెస్టయిన పదిమందిలో ఒకరిని కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారిని భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నయీం బావమరిది మహ్మద్ అష్రప్ తో పాటు అనుచరులు పూత బాలకిషన్, ఎండీ అఖిల్ పాషా, రాపోలు సుదర్శన్, జూకంటి బుచ్చయ్య, ఎండీ ఖాసీంసాబ్, సుధాకర్, వెంకటేశ్ అడ్వకేట్, శ్రీనివాస్, శ్రీధర్ రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 77కు చేరింది.