మోడీ కీలక నిర్ణయం: 7 శాతం వడ్డీకే రైతు రుణాలు
న్యూఢిల్లీ: స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం అమలు చేయాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రైతులు తీసుకునే రూ. 3 లక్షల లోపు స్వల్పకాలిక పంట రుణాలకు 7 శాతం వడ్డీని వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మోడీ మంత్రివర్గం పూర్తి జాబితా: ఎవరెవరికి ఏయే శాఖ
ఈ మేరకు ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ సమావేశంలో వివిధ ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ పథకం ప్రకారం ఏడాది కాలానికి రైతులకు స్వల్పకాలిక రుణం కింద రూ.3 లక్షల వరకు 4 శాతం వడ్డీ రేటుపై పంట రుణం లభిస్తుందన్నారు.
దీనికి ప్రభుత్వం 5 శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నారు. ఇందులో రైతులందరికీ 2 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నామని చెప్పారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు మరింత చౌకగా 4 శాతం వడ్డీయే వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు మరో 3 శాతం వడ్డీ భరించడానికి కేబినెట్ ఆమోదించిందని ఆయన తెలిపారు.
రైతులు ఏడాదిలోపు రుణం చెల్లించకుంటే ఏడు శాతం వడ్డీయే చెల్లించాలని అన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 9 లక్షల కోట్ల పంట రుణాలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇప్పటికే రైతులకు వడ్డీ రాయితీ కోసం రూ. 15,000 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు.
వడ్డీ రాయితీని గతంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ అమలు చేసేదని, ప్రస్తుతం వ్యవసాయ శాఖకు బదిలీ చేశామని తెలిపారు. ఈ పథకం వల్ల దేశంలోని ఎంతో మంది రైతులకు లాభం చేకూరతుందని ఆయన తెలిపారు. సహజ విపత్తుల ద్వారా నష్టపోయిన రైతులకు ఉపశమనం అందించడానికే 2 శాతం వడ్డీ రాయితీని పునర్వ్యవస్థీకరించామని తెలిపారు.