ఆగిన రైతన్న గుండె.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం..
లాక్ డౌన్ వేళ తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడవడంతో ఆ రైతు ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. ధాన్యాన్ని ఎండబెడుతుండగా గుండె నొప్పి రాగా.. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు.
ఎవరా రైతు..
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన మాల భూమయ్య(60) అనే రైతు తన ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. సోమవారం(ఏప్రిల్ 19)న 50 బస్తాల ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రానికి తరలించాడు. అయితే సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిచిపోయింది. మంగళవారం ఉదయం ఇంట్లో భోజనం చేసిన ఐకేపీ కేంద్రానికి వెళ్లిన భూమయ్య తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టాడు. ఆ సమయంలోనే గుండెలో నొప్పిగా అనిపించడంతో సమీపంలోని ఓ చెట్టు కిందకు వెళ్లి ఒరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు.
ఆదుకుంటామన్న ఎమ్మెల్యే..
భూమయ్యకు మతిస్థిమితం లేని భార్య,ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. కుటుంబ భారమంతా భూమయ్యదే. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భూమి మృతి గురించి తెలిసి ఎమ్మెల్యే జాజుల సురేందర్ పొల్కంపేటకు వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10వేలు తక్షణ సాయం అందించారు. భూమయ్యకు తక్షణమే రైతు భీమా అందేలా చర్యలు తీసుకుంటామని.. అతని మనవరాళ్లకు గురుకుల పాఠశాలలో విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. భూమయ్య మరణం స్థానికులను కూడా కంటతడి పెట్టించింది.
40లక్షల ఎకరాల్లో వరి సాగు..
తెలంగాణలో మునుపెన్నడూ లేని రీతిలో 40లక్షల ఎకరాల్లో వరిపంట సాగుచేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో పండిన ఈ పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇందుకోసం రూ.35వేల కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామన్నారు. అయితే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని.. అధికారులు కొనుగోలుకు నిరాకరిస్తున్నారని కొన్నిచోట్ల రైతులు వాపోతున్నారు. అంతేకాదు,40 కిలోల ధాన్యం బస్తాకు రూ.12.50 రూపాయల హమాలీ చార్జిలను వసూలు చేస్తున్నారని.. కష్టకాలంలో ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తే తమకు మేలు చేసినవాళ్లవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు.