కరోనా దెబ్బ: కంప్యూటర్ పక్కనబెట్టి.. నాగలి చేత పట్టిన టెక్కీలు, వ్యవసాయమే బెస్ట్ అంటూ రంగంలోకి..!
కరోనా వైరస్ దెబ్బకు ఇటలీ శవాల దిబ్బగా మారింది. అక్కడ కేసులు రోజురోజుకూ పుట్టుకొస్తూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక ఇటలీలో కరోనావైరస్ విజృంభించడంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి ఇటలీ జారుకోవడంతో ఆ ప్రభావం అక్కడ ఉద్యోగస్తులపై పడింది. చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇక మంచి జీతాలతో ఇంతకాలం పనిచేసిన ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలు పోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు.
కుప్పకూలిన ఇటలీ ఆర్థిక వ్యవస్థ
ఇటలీలో కరోనావైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పలు సొంతసంస్థలు నడుపుతున్న వారు కూడా తమ కంపెనీలను మూసివేసి ఇటలీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే వ్యవసాయంపై పడ్డారు. మాసిమిలియానో కసీనా అనే 52 ఏళ్ల వ్యక్తి ఇటలీలో ఓ ఫ్యాబ్రిక్ కంపెనీని నడిపేవాడు. ఈ కంపెనీకి విదేశాల నుంచి సైతం క్లయింట్లు ఉన్నారు. స్పోర్ట్స్ టీషర్టులను తయారు చేయడంలో ఈ కంపెనీకి ప్రత్యేకత ఉంది. అయితే బిజినెస్ బాగా జరుగుతున్న క్రమంలో కరోనావైరస్ ఒక్కసారిగా ఆ వ్యాపారానికి పెద్ద దెబ్బగా మారింది. ఇక అందరిలానే కసీనా కూడా ఒకప్పుడు ఇటలీ ఆర్థిక వ్యవస్థను ఏలిన వ్యవసాయ రంగం వైపే మొగ్గు చూపాడు.
పారిశ్రామికంగా పరుగులు పెట్టిన ఇటలీ
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ పారిశ్రామికంగా పరుగులు తీసింది. అప్పటి నుంచి కరోనావైరస్ దెబ్బ తీయనంత వరకు ఆర్థిక వ్యవస్థ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సినపని ఇటలీకి ఏర్పడలేదు. కానీ మహమ్మారి దెబ్బతో ఒక్కసారిగా పూర్వవైభవం కోల్పోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ముందు వరుసలో ఉండి నడిపించిన ఫ్యాషన్ రంగం, రీటెయిల్ రంగం, ఎంటర్టెయిన్మెంట్ రంగం అన్నిటినీ కరోనావైరస్ తుడిచిపెట్టేసింది. ఒకప్పుడు వైన్ తోటలతో విరాజిల్లిన ఇటలీ ఇప్పుడు బోసిపోయింది. ఇక ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఒకప్పుడు తన తాతలు తండ్రులు చేసిన వ్యవసాయ రంగంపై దృష్టి సారిస్తున్నారు. పొలాల్లో పనిచేస్తూ పంట పండించి కుదేలైపోయిన ఇటలీకి కొత్త ఊపిరి ఇవ్వాలని భావిస్తున్నారు.
వ్యవసాయమే దిక్కు అంటున్న నిరుద్యోగులు
ఇక వ్యవసాయం చేసేవారు లేక ఇటలీలోని ప్రధాన కూరగాయలైన బ్రోకలీ, బీన్స్, పండ్లు ఇతర కూరగాయల పంటలు ప్రమాదంలో పడిపోయాయి. ఇప్పుడు తిరిగి ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగస్తులంతా పొలంలోకి దిగి పనులు చేస్తుండటంతో ఇటలీ వ్యవసాయ రంగం పుంజుకుంటుందనే ఆశాభావం నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారి తమ దేశం ప్రధాన రంగమైన వ్యవసాయ పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అన్న విషయాన్ని గుర్తు చేసిందని చెబుతున్నారు ఇటలీ వ్యవసాయ శాఖ మంత్రి తెరెస్సా బెల్లనోవా. ఆమె కూడా ఒకప్పుడు రైతు అన్న సంగతి చెప్పారు. ఇక వ్యవసాయం చేసి తిరిగి దేశాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ రంగంలో ఎంతో వృద్ధి ఉందన్న విషయాన్ని నిరుద్యోగులు గ్రహించి వ్యవసాయ రంగంవైపు అడుగులు వేయాలని మంత్రి బెల్లనోవా పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలవారికి ఆదర్శంగా నిలుస్తామని చెబుతున్నారు. ఇదంతా జరగాలంటే వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టాలని చెప్పారు.
వ్యవసాయ రంగంలో తొలి ప్రాధాన్యత ఇటలీవాసులకే
ఇక పొలాలు బాగుపడాలంటే అక్కడ వ్యవసాయం చేసేవాళ్లు కావాలి. అదే సమయంలో నిరుద్యోగులు బాగుపడాలంటే వ్యవసాయం చేయాల్సిందే అనే కొత్త నినాదం ఇటలీలో వినిపిస్తోంది. ఇక ఇటలీలో వ్యవసాయం చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇటలీ ప్రజలకే ఇస్తుండటంతో ఇప్పటి వరకు వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేసిన రొమేనియా, పోలాండ్, భారత్కు చెందిన దాదాపు లక్షా 50 వేల మంది ఉపాధి కోల్పోయారు. ఇక అదే సమయంలో ఇంతకాలం వ్యవసాయంకు దూరంగా ఉండి సొంతంగా రెస్టారెంట్లు, కంపెనీలు, స్టోర్లు నడిపిన వారు.. వారి వ్యాపారం దెబ్బతినడంతో తిరిగి వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు వారికి ఆకర్షణీయమైన జీతం కూడా అందుతోంది.
స్వర్గం నుంచి అమృతం జారిపడ్డట్టే..
ఇక ఇటలీలో ప్రధాన వ్యవసాయ కంపెనీలు ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు పెట్టి దరఖాస్తులను ఆహ్వానించగా ఒక్క ఇటలీ వాసుల నుంచే 20వేల అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్న పాలో ఫిగ్న అనే 26 ఏళ్ల వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో స్వర్గం నుంచి జారిపడ్డ అమృతంలా తనకు వ్యవసాయ రంగంలో పనిచేసే ఉద్యోగం వచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. తనకు స్ట్రాబెర్రీ పొలాల్లో పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పాడు. ఇదిలా ఉంటే చాలా మంది దరఖాస్తు చేసుకున్న వారికి వ్యవసాయ రంగంలో అనుభవం లేనివారు అని ఓ ప్రధాన వ్యవసాయ కంపెనీ అధినేత ఒకరు చెప్పారు. వ్యవసాయం అంటే ఒక యాపిల్ చెట్టు నుంచి పండు తీసి పక్కన పడేయడం కాదని చెప్పారు.