మద్యంతర బడ్జెట్ పై టీ కాంగ్రెస్ గరం గరం..! ఎన్నికల స్టంట్ గా అభివర్ణించిన నేతలు..!
Recommended Video
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే కేంద్రం ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర బీజేపి ప్రభుత్వం పై ద్వజమెత్తింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రాబోయే ఎన్నికలకోసమే అన్నట్లుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోసారి తేలిపోయిందని, బడాబాబులకు ఐటీ తగ్గించారని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ఉందని, టాక్స్ పరిధి పెంచి వచ్చే ఏడాది నుండి అమలు చేస్తామని చెప్పటం దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం వ్యాపారస్థుల మన్ననలు పొందే ప్రయత్నం చేసిందని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్ పై భగ్గుమన్న టీ కాంగ్రెస్..! అంకెల గారడీగా తప్ప మరోటి కాదని విమర్శ..!!
కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన టీ కాంగ్రెస్ నేతలు ఎంపి కవిత, కేటీఆర్ ల పై కూడా మండిపడ్డారు. దేశంలో ఏ స్కీమ్ వచ్చినా.. వీళ్ళే ఆదర్శం అన్నట్టు కేటీఆర్, కల్వకుంట్ల కవిత లు డప్పు కొట్టుకుంటున్నారపి ఆరోపించారు. కేటీఆర్ మా స్కీమ్ ని మోదీ కాపీ కొట్టారు అంటే, కవిత కాపీ కూడా సరిగా కొట్టలేక పోయారు అంటుందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ పై కవిత ఒకలా, కేటీఆర్ మరోలా మాట్లాడతారు అని అన్నారు. బీజేపీ తో దోస్తీ చేయాలి అన్నదే టిఆర్ఎస్ ఆలోచన అన్నారు.
బీజెపి వ్యాపారస్తుల పార్టీ..! రైతాంగం పట్ల కపట ప్రేమ అన్న టీ కాంగ్రెస్..!!
మోదీ వల్ల దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. బడ్జెట్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని, కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడితే, బీజేపీ నిర్వీర్యం చేస్తుందని మండి పడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినా టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదని, బీజేపి ఏక పక్ష నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని గులాబీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు నిలదీసారు. కేంద్ర బీజేపీ తో లోపాయికార ఒప్పందం కారణంగానే పార్లమెంట్ లో ఎంపీలు మౌనం వహించారన్నారు.
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటే మదద్దత్తు ధర ఎందుకు పెంచలేదు..? నిలదీసిన కాంగ్రెస్..!
నాలుగున్నర ఏళ్లు రైతులను మరిచిపోయిన మోదీ ఇప్పుడు కపట ప్రేమ కురిపిస్తున్నారని ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్ష్యుడు ఎం.కోదండరెడ్డి అన్నారు. ఒక్కసారైనా మద్దతు ధర పెంచారా ..? అని ప్రశ్నించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే కనీస మద్ధతు ధర ముఖ్యం అన్నారు. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరోటి కాదని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక వంటనూనె, చక్కెర, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు.
మోదీ పాలసీలు రైతు వ్యతిరేకం.! వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లడం ఖాయమన్న కాంగ్రెస్..!!
ప్రభుత్వం చేసుకుంటున్న దిగుమతులు వ్యవసాయ రంగ సంక్షోభానికి అద్దం పడుతుందన్నారు. బీజేపీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు కోదండ. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాప్ ఇన్సూరెన్స్ ఓ పెద్ద స్కామ్ అని ఆరోపించారు. మోదీ నాలుగున్నరేళ్లు రైతాంగాన్ని దగా చేశారని కోదండ రెడ్డి మండి పడ్డారు. బీజెపి ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని ఆయన తెలిపారు.