కేంద్ర బడ్జెట్ 2018: వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనే ఫోకస్
Recommended Video
న్యూఢిల్లీ: 2018-19 వార్షిక బడ్జెట్ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గురువారం లోక్సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రైతన్నల వ్యవసాయ పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయిస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
మొదలైన బడ్జెట్ ప్రసంగం... మదుపర్లలో తీవ్ర ఉత్కంఠ, విశ్లేషకులు ఏమంటున్నారంటే...
వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు కూడా ఆయన పలు పథకాలను ప్రకటించారు. ఆపరేషన్ గ్రీన్తో పాటు పాడి పరిశ్రమ, మత్స్యపరిశ్రమ కోసం పలు కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఆపరేషన్ గ్రీన్కు రూ 500 కోట్లు కేటాయించామని, ఒకవేళ మార్కెట్ ధరలు.. మద్దతు ధరల కంటే తక్కువ ఉంటే.. ఆయా వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జైట్లీ వివరించారు.
బడ్జెట్ ప్రాధాన్యతలను వివరిస్తూ... వృద్ధి రేటును నిలకడగా కొనసాగిస్తూ రాబోయే సంవత్సరాల్లో 8 శాతానికి పైగా వృద్ధి సాధించే దిశగా వ్యవస్థాగత సంస్కరణలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ 2018 : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
జీఎస్టీ, నోట్లరద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఎదుగుతోందని, 2014 వరకూ విధాన లోపంతో దేశం నష్టపోయిందని, అవినీతి పేరుకుపోయిందని ఆర్థికమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధానాలను పూర్తిగా మార్చివేశామని చెప్పారు. ఇప్పుడు సహజవనరులను పారదర్శకంగా కేటాయిస్తున్నామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.