ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రూ.9 కోట్ల అప్పుకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో రాజ్పాల్ యాదవ్కు విధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ కేసులకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ రోజు తీర్పును వెలువరించారు. శిక్షతో పాటు ప్రతి ఫిర్యాదుదారునికి రూ.1.05 కోట్లు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రతి ఫిర్యాదుదారుడికి చెల్లింపులతో పాటు న్యాయస్థానానికి రూ.25,000 చెల్లించాలి.
రాజ్పాల్ యాదవ్ భార్య రాధా యాదవ్ ను కూడా ప్రతి కేసులో ఫిర్యాదుదారునికి రూ.5,51,380 చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. రాజ్పాల్ యాదవ్ ఇదివరకే చెల్లించిన సుమారు రూ.2 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ తుది చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా నటుడికి రెండు నెలల సమయాన్ని న్యాయస్థానం మంజూరు చేసింది.
కేసు నేపథ్యం ఏమిటంటే?
రాజ్పాల్ యాదవ్ 2012లో దర్శకుడిగా మారి తీసిన సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఆ సమయంలో తీసుకున్న అప్పులు, వడ్డీలతో కలిపి బకాయిలు రూ.9 కోట్లకు చేరాయి. ఈ క్రమంలో చెక్కులు బౌన్స్ అవ్వడంతో కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న జరిగిన విచారణలో న్యాయస్థానం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది. కానీ అప్పట్లో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ వ్యవహారంలో 2018 నాటి మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును, ఆ తర్వాత 2019 నాటి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజ్పాల్ యాదవ్ దంపతులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఈ తుది తీర్పును వెలువరించింది. న్యాయస్థానానికి ఇచ్చిన హామీల ప్రకారం డబ్బులు చెల్లించడంలో రాజ్పాల్ యాదవ్ పదే పదే విఫలం కావడంతో న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ శిక్షను ఖరారు చేసింది.