బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన ఓ సంచలన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఓ పాడ్కాస్ట్లో కృతి సనన్ మాట్లాడుతూ.. తాను కొన్నేళ్ల క్రితమే తన అండాలను భద్రపరుచుకున్నట్లు బహిరంగంగా తెలపడం గమనార్హం. కృతి సనన్ తన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా 'మిమి' షూటింగ్ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. "ఈ విషయాన్ని నేను మొదటిసారిగా చెప్తున్నాను. నేను నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నాను. మిమి' చిత్రం కోసం నేను బరువు పెరగాల్సిన సమయంలో ఈ పని పూర్తి చేశాను. సాధారణంగా ఎగ్ ఫ్రీజింగ్ వల్ల శరీరం ఉబ్బినట్లు అవుతుంది. నేను ఎలాగూ సినిమా కోసం బరువు పెరుగుతున్నాను కాబట్టి.. అదే సరైన సమయమని భావించాను" అని కృతి సనన్ పేర్కొన్నారు. దీని గురించి ఒకరు తనకు ముందే వివరించారని.. ఓ మహిళ తన కోసం తాను ఇచ్చుకోగలికే అద్భుతమైన కానుక అని కృతి అభిప్రాయపడింది.
ఈ విషయంపై నెట్టింట నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కృతి సనన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. పెళ్లి, పిల్లలు అనే సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోకుండా.. కెరీర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ తన భవిష్యత్తుపై పూర్తి నియంత్రణ సాధించడమే కాకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం తెలివైన నిర్ణయం అని పేర్కొన్నారు.
మరోవైపు కొంత మంది నెటిజన్లు ఇలాంటి వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఏముందంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇండియాలో నేటికీ సంతానోత్పత్తి, అండాలను భద్రపరచుకోవడం వంటి అంశాలపై స్వేచ్ఛగా మాట్లాడటాన్ని ఓ వర్గం ప్రజలు అంగీకరించలేకపోతున్నారని ఈ ట్రోల్స్ సూచిస్తున్నాయి. సంప్రదాయాల ప్రకారం ఓ నిర్దిష్ట వయసులోనే పెళ్లి, పిల్లలు జరగాలనే భావన ఇంకా సమాజంలో బలంగా ఉంది. ఈ క్రమంలో కృతి సనన్ లాంటి ఓ ప్రముఖ నటి అండాలను భద్రపరచుకోవడం గురించి బహిరంగంగా మాట్లాడటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది మహిళల్లో ఓ కొత్త అవగాహనకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లి, మాతృత్వం, కెరీర్ అనేవి అందరి జీవితాల్లో ఒకేలా సాగాల్సిన అవసరం లేదని.. సమాజం నిర్దేశించిన టైమ్ లైన్ ప్రకారం కాకుండా.. మహిళలు తమకు నచ్చినప్పుడు, తాము సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలనే బలమైన సందేశాన్ని కృతి సనన్ ప్రకటించింది.