మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం పెద్ద సినిమాలు తీయడమే కాదు.. పెద్ద మనసు ఉన్న వ్యక్తి కూడా అని మరోసారి రుజువైంది. ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చిరంజీవి వాటిని సామరస్యంగా పరిష్కరించి గొప్ప మనసు చాటుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు వచ్చాయని.. జూలై 12 ఆదివారం సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వాళ్లిద్దరినీ తన దగ్గరకు పిలిపించుకొని, మాట్లాడి, సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించారు.
దాంతో జానీ మాస్టర్- శేఖర్ మాస్టర్ మధ్య నిన్నటి వరకూ ఉన్న గ్యాప్ కాస్తా.. చిరు మధ్యవర్తిత్వంతో ముగిసిపోయింది. నిజానికి ఈ పంచాయితీ తన వరకూ వెళ్లలేదు. ఒక రకంగా చిరంజీవికి సంబంధం లేని విషయం అనే చెప్పాలి. అందులోనూ ఆయన సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. అయినా సరే.. టైమ్ తీసుకొని, సమస్య ఏంటో అడిగి తెలుసుకొని, పరిష్కార మార్గం సూచించారు. ఇలా కదా ఉండాలి ఇండస్ట్రీ పెద్ద అంటే.. ఆ పదవికి ఇంతకు మించిన అర్హత కావాలా..? అని సోషల్ మీడియాలో చిరంజీవిని ప్రశంసిస్తున్నారు.
ఇక ఈ వివాదంపై జానీ మాస్టర్ స్వయంగా స్పందించారు. తనకు శేఖర్ మాస్టర్ కు మధ్య ఎలాంటి అపార్థాలు, విభేదాలు లేవని తెలిపారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. శేఖర్ మాస్టర్ తనకు అన్నలాంటి వారని.. తామిద్దరం ఒకే కుటుంబంలా ఎప్పటినుంచో కలిసి ఉంటున్నామని పేర్కొన్నారు. ఒకరికి ఒకరం ఎప్పుడూ అండగా నిలిచామని.. తమ మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.