పూరీ జగన్నాథుడికి మనిషిలా అంత్యక్రియలు.. ఈ రహస్యం మీకు తెలుసా?

దేవుడికి కూడా అంత్యక్రియలు చేస్తారని మీకు తెలుసా? అవును.. ప్రపంచంలో ఒక్క పూరీ జగన్నాథ దేవాలయంలో దేవుడికి అంత్యక్రియలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. దేవుడైనా భూమిపైకి వచ్చిన తర్వాత ప్రకృతి నియమాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. సాధారణంగా ప్రతీ 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో పూరీ జగన్నాథ ఆలయంలో ఈ 'నవకళేబర' ఉత్సవం జరుగుతుంది. మానవ శరీరం లాగే పాత విగ్రహాల ఆయుష్షు ముగిసిందని భావించి, కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించి, సాక్షాత్తు ఆ పరమాత్ముడికే మానవ రీతిలో అంత్యక్రియలు నిర్వహించడం ఈ ఉత్సవ విశేషం.

Advertisement

కొత్త విగ్రహాల తయారీకి ప్రత్యేకమైన వేప చెట్టును ఉపయోగిస్తారు. రాజగురువుల అనుమతి పొందాక దాదాపు 80 మంది సేవకులు చెట్టును వెతుకుతారు. వారు ముందుగా పూరీకి సమీపంలో ఉన్న కాకట్‌పూర్ మంగళచండీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అర్చకునికి స్వప్నంలో అమ్మవారు ఆ చెట్లు ఎక్కడ ఉందో దివ్య సంకేతాల ద్వారా సూచిస్తుంది.

Advertisement
vastu tips: వాస్తు ప్రకారం అదృష్టం కలిసిరావాలంటే ఏం చేయాలి?

చెట్టును గుర్తించిన తర్వాత యజ్ఞం

చెట్టును గుర్తించాక శాస్త్రోక్తంగా యజ్ఞం నిర్వహిస్తారు. మొదట పతి మహాపాత్రుల వారు బంగారు గొడ్డలితో చెట్టును స్పృశించగా, ఆ తర్వాత దైతాపతులు వెండి గొడ్డలితో, చివరగా శిల్పులు ఇనుప గొడ్డలితో చెట్టును నరుకుతారు. ఆ చెక్క దిమ్మెలను కొత్తగా తయారుచేసిన బండ్లపై వస్త్రాలతో కప్పి, అత్యంత రహస్యంగా పూరీ ఆలయానికి తరలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని 'కోయిలి వైకుంఠం' అనే రహస్య ప్రదేశంలో శిల్పులు 21 రోజుల పాటు అత్యంత నియమ నిష్ఠలతో విగ్రహాలను చెక్కుతారు. ఈ సుదీర్ఘ ప్రక్రియలో శిల్పులు బయటకు రారు, ఇతరులెవ్వరినీ లోపలికి అనుమతించరు. వారు కేవలం ఆలయ మహాప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఈ పవిత్ర కార్యాన్ని పూర్తి చేస్తారు.

Advertisement

అమావాస్య అర్థరాత్రి వేళ ఆత్మ మార్పిడి

అమావాస్య అర్ధరాత్రి వేళ అత్యంత శక్తివంతమైన ఆత్మ మార్పిడి జరుగుతుంది. పాత విగ్రహాల గుండె భాగంలో ఉండే 'బ్రహ్మ పదార్థాన్ని' కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. ఆ సమయంలో పూరీ నగరం అంతటా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. బ్రహ్మ పదార్థాన్ని మార్చే దైతాపతి సేవకుల కళ్లకు గుడ్డలు కడతారు, చేతులకు పట్టు వస్త్రాలు చుడతారు. దాన్ని ప్రత్యక్షంగా చూసినా లేదా స్పర్శించినా తట్టుకోవడం సాధ్యం కాదు. అయితే ఆ సమయంలో అది జీవంతో స్పందిస్తున్న నవజాత శిశువు లేదా పక్షుల గుండె చప్పుడులా అనిపిస్తుంది.

Advertisement
vastu tips: వాస్తు ప్రకారం సంపద నిలవాలంటే పర్సులో ఇలా చేయండి

కోయిలి వైకుంఠం స్మశాన వాటిక

బ్రహ్మ పదార్థాన్ని వేరు చేసిన తర్వాత, ఆలయ ప్రాంగణంలోని 'కోయిలి వైకుంఠం' అనే రహస్య శ్మశాన వాటికలో పాత విగ్రహాలను వేద మంత్రోచ్ఛారణల మధ్య సమాధి చేస్తారు. విగ్రహాల భూస్థాపన అనంతరం, పూజారులు 11 రోజుల పాటు మైల పాటిస్తారు. మానవులకు చేసినట్లే 10వ రోజు, 11వ రోజులలో దశదిన కర్మలు, ఉత్తరక్రియలు, పిండప్రదాన కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ దివ్య కర్మలన్నీ పూర్తయిన తర్వాత నూతన విగ్రహాలు రత్నసింహాసనాన్ని అధిష్ఠిస్తాయి. అనంత విశ్వానికి అధిపతియైన జగన్నాథుడు, మానవ జన్మ ఎలా నశిస్తుంది, ఆత్మ ఎలా శాశ్వతం అనేది లోకానికి చాటిచెప్పడానికే ఈ 'నవకళేబర' లీలలను ప్రదర్శిస్తుంటాడు.

English Summary

Funeral rites, similar to those performed for a human being, are conducted for Lord Jagannath of Puri once every 12 or 19 years. This process is carried out in great secrecy, and the ten-day mourning rituals are also observed.