ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్!

నంద్యాల జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అహోబిలం వేదికగా సాగుతున్న 'తలనీలాల' రాజకీయం ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. అధికార టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి (నాని) మధ్య రేగిన సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఇరుపక్షాల అనుచరులు, భారీగా మోహరించిన పోలీసు బలగాలతో ఆళ్లగడ్డ, అహోబిలం పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

అవినీతి ఆరోపణలు.. ఓపెన్ ఛాలెంజ్!

అహోబిలం మఠం తలనీలాల టెండర్ కాంట్రాక్ట్ వ్యవహారంలో ఎమ్మెల్యే అఖిలప్రియకు భారీగా ముడుపులు అందుతున్నాయని, ఇటీవల అవి అందకపోవడంతోనే ఆమె టెండర్లను, తలనీలాల తరలింపును అడ్డుకున్నారంటూ గంగుల నాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, నిజంగానే ఆధారాలు ఉంటే దేవుని సాక్షిగా అహోబిలానికి వచ్చి నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తలనీలాల వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్లు రుజువు చేస్తే.. ముఖ్యమంత్రి సమక్షంలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని భీష్మించుకూర్చున్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే గంగుల నాని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

అహోబిలం టు ఆళ్లగడ్డ.. నేరుగా గంగుల ఇంటికే!

చేప్పినట్లుగానే ఎమ్మెల్యే అఖిలప్రియ తన అనుచరులతో కలిసి అహోబిలం క్షేత్రానికి చేరుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే గంగుల నాని అక్కడికి రాకపోవడంతో, "నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికి వచ్చి నిలదీస్తా" అంటూ అఖిలప్రియ అహోబిలం నుంచి నేరుగా ఆళ్లగడ్డలోని గంగుల నాని నివాసానికి వాహన శ్రేణితో బయలుదేరారు. ఈ వార్త బయటకు రావడంతో ఇరువర్గాల అనుచరులు పెద్ద సంఖ్యలో ఆళ్లగడ్డకు చేరుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు గంగుల నానిని అహోబిలం వెళ్లకుండా గృహనిర్బంధం చేయగా, ఆయన నివాస పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

టెండర్ వెనుక అసలు కథ ఇదే: అఖిలప్రియ వివరణ

తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు తలనీలాల టెండర్ కేటాయించే విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే తాము అభ్యంతరం తెలిపామని అఖిలప్రియ స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యల కారణంగా అధికారులు అధికారికంగా టెండర్లను వాయిదా వేస్తున్నట్లు లేఖ ఇచ్చాక కూడా.. తమిళనాడు సంస్థతో రహస్య ఒప్పందం ఎలా జరిగిందో గంగుల నాని చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ టెండర్ల వెనుక ఉన్న మాజీ సీఏఓ పార్థసారధిపై ఇతర రాష్ట్రాల్లో చీటింగ్, క్రిమినల్ కేసులు ఉన్నాయని, రాంచీ కోర్టు ఆయన్ను "పర్మనెంట్ అబ్స్కాండర్"గా ప్రకటించిందని.. అలాంటి వ్యక్తి నడిపిన ప్రక్రియపై నమ్మకం లేకే తాము ప్రశ్నించామని ఆమె వివరించారు.

Advertisement

జిల్లా ఎస్పీపై ఎమ్మెల్యే ఫైర్.. హీరోను చేయాలని చూస్తున్నారా?

ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య నంద్యాల జిల్లా ఎస్పీ పనితీరుపై ఎమ్మెల్యే అఖిలప్రియ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అహోబిలం సీఏవో వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని, టెండర్లలో ఏదో మతలబు జరుగుతోందని ముందే ఎస్పీ దగ్గర పంచాయితీ జరిగిందని, అయినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. "గంగుల నాని ఇంటి దగ్గర పోలీసుల హడావుడి ఎందుకు? ఆయన్ను చర్చకు రాకుండా అడ్డుకుని, నన్ను అడ్డుకున్నట్లు మచ్చ వేయాలని చూస్తున్నారా? బిజేంద్రరెడ్డిని హీరో చేయాలని అనుకుంటున్నారా?" అంటూ నిలదీశారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడాలనుకుంటే ఇద్దరు నేతలతోనూ మాట్లాడాలని హితవు పలికారు. తనపై వేసిన నిందలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. లేదా గంగుల నాని క్షమాపణ చెప్పే వరకు తాము ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని అఖిలప్రియ భీష్మించడంతో ఆళ్లగడ్డ పాలిటిక్స్ ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

English Summary

High political tension gripped Nandyal's Allagadda as TDP MLA Bhuma Akhila Priya and YSRCP's Gangula Brijendra Reddy traded open challenges over Ahobilam temple tonsure contract allegations.