అమరావతి:ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి పరుషపదాలతో తీవ్ర విమర్శలు గుప్పించారు. సిఎం చంద్రబాబు రాష్ట్రంలో డ్రామా కంపెనీ పార్టీ పెట్టి కుతంత్రాలు చేస్తున్నాడని కన్నా మండిపడ్డారు.
నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలసి నడిచిన చంద్రబాబు నేడు పొత్తు విషయంలో తప్పు చేశానని అంటుంటే అన్నం పెట్టిన చేయిన నరికే నర హంతకుడిలా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని కన్నా ధ్వజమెత్తారు. 2014 లో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని పత్రికల్లో, టీవిల్లో పదే పదే ప్రకటించిన చంద్రబాబు నేడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
అంతకుముందు ప్రతి వారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తున్న కన్నా లక్ష్మీనారాయణ తన 11వ లేఖను విడుదల చేశారు. అందులో భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దుపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా మొదట నిర్వహించిన టెండర్ దక్కించుకుంటే దాన్ని ఎందుకు రద్దు చేశారో వివరాలు చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. కేవలం ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చేందుకే మొదటి టెండర్ రద్దు చేశారని కన్నా ఆరోపించారు. తెదేపా పరిపాలనలో మహిళా ఉద్యోగులపై దాడులు పెరిగిపోయాయని కన్నా ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ఇంతటి అసమర్థ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా పాలించే అర్హత లేదని కన్నా దుయ్యబట్టారు. ఏపీఎన్ఆర్టీ సిఈవోగా అమెరికా పౌరసత్వం ఉన్న వేమూరి రవిని నియమించారని...ఒకవేళ అందులో అందులో ఏమైనా అక్రమాలు జరిగితే ఆయన్ని మన చట్టాల ప్రకారం శిక్షించలేమని కన్నా తన లేఖలో వెల్లడించారు. వర్షం పడిన ప్రతిసారి రాష్ట్ర సచివాలయంలో నీరు లీకవుతోందని...దీంతో రాష్ట్రం పరువు బజారున పడుతోందని కన్నా తన లేఖలో పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు లీకవటానికి కారణాలేంటో విచారణ చేయించాలని కన్నా డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు టిడిపి ప్రభుత్వం ఎంత చెల్లింపులు జరిపారో చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆడిటోరియాలు అనేకం ఉన్నా వాటిని పక్కన బెట్టి ప్రైవేటు ఫంక్షన్ హాళ్లనే బుక్ చేయిస్తూ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు డబ్బులు దోచిపెడుతున్నారని కన్నా ఆరోపించారు.