మేనిఫెస్టోలో లేకున్నా రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ప్రతి నేతన్న కుటుంబానికి రూ. 25 వేలు

నేతన్నల కుటుంబాలకు ఏపీలోని ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న కూటమి సర్కార్... తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.

Advertisement

రేపు (ఆగస్టు 7వ తేదీ) '12వ జాతీయ చేనేత దినోత్సవం'ను పురస్కరించుకుని 'నేతన్న సేవలో' పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు రూ.179 కోట్లను ప్రభుత్వం అందించనుంది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో సర్కారు సాయం అందిస్తోంది.

Advertisement

చేనేత చీరలు, బట్టలపై 40 శాతం డిస్కౌంట్, ఏపీలో స్టాల్స్ అక్కడే.. త్వరపడండి!

చేనేత రంగం బలోపేతం దిశగా...

తాజాగా ప్రవేశపెడుతోన్న నేతన్న సేవలో పథకమే కాకుండా ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కల్పిస్తోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చు కానుంది.

అంతేకాకుండా 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్‌ ద్వారా రూ.79 కోట్లు అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.

Advertisement
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక ప్రకటన

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో రేపు 'నేతన్న సేవలో' పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

  • శుక్రవారం ఉదయం 10.30 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు
  • ఉదయం 10.50 గంటలకు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చేరుకుంటారు.
  • ఉదయం 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించి.. ప్రసంగిస్తారు.
  • మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు.
  • సాయంత్రం 04.10 గంటలకు కొత్తపేటలో టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
  • సాయంత్రం 04.45 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

English Summary

AP Govt launches 'Netanna Sevalo' scheme on National Handloom Day, providing Rs 25,000 cash assistance to over 71,000 weaver families across Andhra Pradesh.