రూల్ 8: ఆ ఒక్క లెటర్‌తో చిక్కుల్లో ఏబీ వెంకటేశ్వర రావు: కఠిన చర్యలకు జగన్ సర్కార్ సిద్ధం


అమరావతి: ఏపీ ఇంటెలిజేన్స్‌ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవడానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల (డిసిప్లినరీ అండ్ అప్పీల్) రూల్స్ 1969ను ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులోని రూల్ 8 ఆధారంగా ఏబీ వెంకటేశ్వర రావుపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. దీనిపై 30 రోజుల్లోపు వ్యక్తిగతంగా హజరవ్వడంతో పాటు, లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనగా..

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా, లిఖితపూరక వివరణ ఇవ్వకపోయినా రూల్ 8 ప్రకారం.. శాఖాపరమైన, క్రమ శిక్షణా చర్యలు తప్పవని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోయినట్లయితే, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా ఏబీ వెంకటేశ్వర రావుపై తదుపరి చర్యలను తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రూల్స్ విరుద్ధంగా

అఖిల భారత సర్వీసుల (కండక్ట్) రూల్స్ 1968లోని రూల్ 7 కింద కూడా ఏబీ వెంకటేశ్వర రావుపై చర్యలను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం.. అఖిల భారత సర్వీసులకు చెందిన ఓ అధికారి తన పేరు మీద ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రభుత్వానికి, సర్వీసులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయకూడదు. మీడియాకు వెల్లడించకూడదు. ఈ నిబంధనను కూడా ఏబీ వెంకటేశ్వర రావు ఉల్లంఘించిన్లు ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. అలాగే- ఆయన ప్రవర్తన అఖిల భారత సర్వీసుల (డిసిప్లినరీ అండ్ అప్పీల్) రూల్స్ 1969లోని రూల్ 3కు విరుద్ధమని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
ఆ లెటర్..

ఇదివరకు తాను అందజేసిన డాక్యుమెంట్లను పోర్జరీ చేశారని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ కొద్దిరోజుల కిందటే ఏబీ వెంకటేశ్వర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే. విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఆయన అప్పట్లో చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఈ లేఖ రాశారు. తన డాక్యుమెంట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా ఫోర్జరీ, ట్యాంపర్ చేశారని ఆరోపించారు. సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.

తోటి ఉన్నతాధికారులపై


ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపణలు చేసిన ఆ అధికారులందరూ అఖిల భారత సర్వీసులకు చెందిన వారే. వారిపై ఆరోపణలు చేయడం, వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ లేఖ రాయడం అధికార యంత్రాంగంలో కలకలం రేపింది. ఆయన రాసిన లేఖపై ఆదిత్యనాథ్ దాస్ అంతర్గతంగా విచారణ జరిపించినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా తేలినట్లు సమాచారం. అందుకే ఏబీ వెంకటేశ్వర రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని భావిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా.. లిఖిత పూరక వివరణ ఇవ్వడానికి 30 రోజుల గడువును కూడా ఆయనకు ఇచ్చింది.

Read more about: అమరావతి
Read more...

English Summary

AP government has initiated disciplinary proceedings against suspended IPS officer AB Venkateswara Rao. Orders to this effect have been issued by Chief Secretary Aditya Nath Das under Rule 8 of All India Services (Discipline & Appeal) Rules, 1969.