అమరావతి.. మావిగన్.. విజయవాడ - జగన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతి- మావిగన్ పై జగన్ చేసిన ప్రతిపాదన గురించి చంద్రబాబు స్పందించారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా, ముఖ్యంగా 'స్టీల్ స్టేట్'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ స్టీల్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

Advertisement

కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా, రాయలసీమ ప్రాంతాన్ని కూడా 'ఉక్కుసీమ'గా మారుస్తామని హామీ ఇచ్చారు. గతంలో స్టీల్ ప్లాంట్ పేరుతో కొందరు ఐరన్ ఓర్‌ను దోచుకుంటూ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువచ్చామన్నారు. స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఇక్కడి యువతకే ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తీసుకురావడం వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారాయన్నారు. ఇప్పటివరకూ అక్కడ 19 లక్షల కార్లు తయారయ్యాయని గుర్తుచేశారు. రాయలసీమకు ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరి హయాంలో మంచి జరిగిందో ప్రజలు చరిత్రను ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు. ఒకప్పుడు రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ సంస్కృతిని అంతం చేశామని చెప్పుకొచ్చారు.

Advertisement

రెండేళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం

రాజధాని విషయంలో జగన్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. 2014లో అమరావతిని రాజధానిగా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు, అయితే అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానులంటూ నవ్వులపాలు చేశారు. మావిగన్, విజయవాడ అంటూ మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారు. రేపు ఇంకేమంటారో తెలియని పరిస్థితి. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. రాష్ట్రంలో రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు. ఇలాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం స్పష్టం చేసారు. పోలీసుల నైతికత దెబ్బ తీసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరు అడ్డు వచ్చినా అమరావతి పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేసారు.

English Summary

CM Chandra Babu launched JSW Rayalaseema Integrated Steel Plant in Kadapa district, made key announcement