వైసీపీలోకి నాటి జెయింట్ కిల్లర్ రీ ఎంట్రీ, అదే బాటలో మాజీ మంత్రి..!?

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. రాజధాని కేంద్రంగా వచ్చే ఎన్నికల పైన జగన్ కీలక ప్రకటన చేసారు. ఇదే సమయంలో 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అయితే, వైసీపీ ఓడిన తరువాత పార్టీ వీడిన కొందరు ముఖ్య నేతలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో మాజీ మంత్రి సైతం ఉన్నారని తెలుస్తోంది. వీరు త్వరలోనే జగన్ ను కలిసేందుకు సిద్దం అవుతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

Advertisement

వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యులతో పాటుగా ఎమ్మెల్సీలు.. విజయ సాయిరెడ్డి, మాజీ మంత్రులు పార్టీని వీడిన వారిలో ఉన్నారు. కాగా, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలతో కొందరు నేతలు తిరిగి వైసీపీ ముఖ్యులతో టచ్ లోకి వచ్చినట్లు పార్టీ లో ప్రచారం సాగుతోంది. వారిలో పలువురు ముఖ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల పైన ఈ సారి వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

Advertisement

2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ ను ఓడించిన నాటి జెయింట్ కిల్లర్ గ్రంధి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. 2024 ఎన్నికల తరువాత తన వ్యాపారాల మీద కూడా ఒత్తిళ్ళు ఉండడంతో వైసీపీకి దూరం జరిగారు. ఒకానొక సమయంలో ఆయన బీజేపీ లేదా టీడీపీలో చేరుతారు అని కూడా ప్రచారం సాగింది. అయితే ఇపుడు గ్రంధి శ్రీనివాస్ వైసీపీలోకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తారని పార్టీలో నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రంధి శ్రీనివాస్ ఈ విషయం పైన అధికారికంగా స్పందించలేదు. అదే విధంగా మరి కొందరు నేతలతోనూ వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.

Advertisement

చేరికల పైన పార్టీలో చర్చ

కాగా, ఉత్తరాంధ్రతో పాటుగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సైతం తిరిగి వైసీపీ వైపు ఆసక్తి గా ఉన్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గతంలో వైసీపీలో కీలక పదవులు చేపట్టిన గోదావరి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కూడా ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. గ్రంధి శ్రీనివాస్ కు భీమవరంలోని అన్ని సామాజికవర్గాల్లో బలమైన వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉండటం ఆయనకు కలసి వచ్చే అంశంగా వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

గోదావరి జిల్లాల్లో ఈ సారి వైసీపీ కొత్త వ్యూహాలు అమలు చేసేందు కు సిద్దం అవుతోంది. అందులో భాగంగా కాపు నేతలకు జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నెల మూడో వారంలో విశాఖలో వైసీపీ కాపు నేతలు భేటీ కానున్నారు. తాజా పరిణామాల పైన చర్చించనున్నారు. అయితే, పార్టీ మారిన నేతలను తిరిగి తీసుకోవటం పైన జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. వైసీపీలో ఈ చేరికల వ్యవహారం ప్రస్తుతం కీలక చర్చగా మారుతోంది.

English Summary

Former leaders to back in YSRCP amid latest political developments, YS jagan to approve their re entry