ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిరిడీలో భక్తుల తాకిడి నెలకొంది. గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా లక్షలాదిమంది భక్తులు సాయినాథుడిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన ఓ భక్తుడు సాయిబాబాకు ఊహించని రీతిలో భారీ గురుదక్షిణ సమర్పించుకున్నారు. సాయిబాబా పట్ల తన భక్తిని చాటుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఈ కానుకను సాయి సంస్థాన్ కు అందజేశారు.
ఆ భక్తుడి పేరు.. మల్లాది శ్రీనివాసరావు. సుమారు 1.5 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని షిరిడీ సాయిబాబా సంస్థాన్కు కానుకగా అందజేశారు. దీని బరువు 642 గ్రాములు. మేలిమి బంగారంతో దీన్ని తయారు చేయించారు. శ్రీమహావిష్ణువు దశావతారాల చిత్రాలను చెక్కారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం సాయిబాబా నవగ్రహాల స్వరూపమని, అందుకే ఆయనకు ఈ నవగ్రహ కిరీటాన్ని సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
సాయిబాబా.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు దత్తాత్రేయుడి స్వరూపమని, ఆదిపరాశక్తి అంశగా తాను విశ్వాసిస్తానని అన్నారు. ముంబైకి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు ఓ బంగారు హారాన్ని సాయిబాబాకు కానుకగా సమర్పించారు. తాను కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా 300 గ్రాముల బరువున్న బంగారు హారాన్ని బాబాకు సమర్పించారు. దీని విలువ 47 లక్షల రూపాయలు ఉంటుందని సంస్థాన్ ట్రస్ట్ అధికారులు అంచనా వేశారు. గురుపౌర్ణమి రెండో రోజు ఉత్సవాల వేళ కూడా ఆలయానికి కానుకలు వెల్లువెత్తాయి. సాయి సన్నిధిలో ఉంచడానికి 51 గ్రాముల బరువు కలిగిన రెండు కిరీటాలను మహారాష్టకు చెందిన భక్తులు సమర్పించారు. వాటిపై 'ఓం' అనే అక్షరాలు ముద్రించి ఉన్నాయి. మొత్తంగా గురుపౌర్ణమి ఉత్సవాల తొలి రెండు రోజుల్లో సాయిబాబాకు ఒక కిలో 53 గ్రాముల మేర బంగారు కానుకలు అందినట్లు గోరక్ష గాడిల్కర్ తెలిపారు. వీటి విలువ 1.70 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. అటు.. గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా షిరిడీ ఆలయం మొత్తం లక్షలాది మంది సాయి భక్తుల రాకతో పులకించిపోతోంది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన యాత్రికులు బాబాను దర్శించుకుంటోన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సంస్థాన్ అధికారులు ప్రత్యేక అభిషేకాలు, పల్లకీ సేవలు, రథోత్సవాల వంటి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తోన్నారు. ఈ శుభ తరుణంలో భక్తులు సమర్పించిన కానుకలు సాయిబాబాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ దూకుడు- బిగ్ జాక్ పాట్