నడి సముద్రంలో ఏడుగురు జాలర్లు గల్లంతు.. అల్పపీడన గండం!

విశాఖపట్నం సముద్ర తీరంలో తీవ్ర కలకలం రేగింది. చేపల వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడం, మరోవైపు బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో మత్స్యకారులు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు ఉమ్మడిగా సముద్రంలో భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

Advertisement

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 'INDAP-VS-MM-83' నంబరు గల బోటులో ఏడుగురు మత్స్యకారులు జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు చేపల వేటకు వెళ్లారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కారె చిన్నయ్య, సీతోడులతో పాటు భీమిలికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఈ బోటులో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 4వ తేదీ మధ్యాహ్నానికే వీరంతా తిరిగి హార్బర్‌కు చేరుకోవాల్సి ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా వీరికి తెలపగా.. 4వ తేదీ మధ్యాహ్నానికి వచ్చేస్తామని వారు చెప్పారు. తీరా కట్ చేస్తే, శనివారం సాయంత్రం దాటినా వారు తిరిగి రాకపోవడం, ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

రంగంలోకి నేవీ హెలికాప్టర్లు!

మత్స్యకారుల బోటు గంగవరం తీరానికి సమీపంలో ఉన్న సమయంలోనే అందులో సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సహాయక బృందాలు.. బోటు యజమాని కారె చిన్నయ్యను సురక్షితంగా గుర్తించి క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. అయితే, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దించి గగనతలం నుంచి కూడా గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.

Advertisement

సీఎం చంద్రబాబు సీరియస్..

మత్స్యకారుల గల్లంతు ఉదంతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోస్ట్‌గార్డ్ నౌకలు, నేవీ హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. సముద్రంలో జరుగుతున్న ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించిన చంద్రబాబు.. ఈ వివరాలను తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. అలాగే బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులను సీఎం ఆదేశించారు. మిగిలిన ఆరుగురిని కూడా ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు సహాయక బృందాలు గాలితో పోరాడుతున్నాయి.

Advertisement

సురక్షితంగా తిరిగి రావాలి: జగన్

మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి, గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. ఈ కష్టసమయంలో మత్స్యకారుల కుటుంబాలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

విశాఖ ప్రాంత వైయస్సార్‌సీపీ నాయకులు బాధిత మత్స్యకారుల కుటుంబాలను సంప్రదించి వారికి అవసరమైన సహాయం అందించాలని, అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యల పురోగతిని తెలుసుకోవాలని వైయస్‌ జగన్‌ సూచించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

English Summary

CM Chandrababu Naidu ordered an intense Navy and Coast Guard rescue operation using helicopters and ships to locate six fishermen missing off the Vizag coast. విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటన తీర ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.