అనంతపురం: అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం ఆగడాలు మితిమీరుతున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని నోరుపారేసుకోవడం ఆ కుటంబం సభ్యుల్లో కామన్ అయిపోయింది. మొన్న జేసీ దివాకర్ రెడ్డి, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, నేడు జేసీ తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి. ఇలా ఒక్కొక్కరు తమ ప్రతాపాన్ని సామాన్యుడిపై చూపుతున్నారు. ఇక అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి రెండురోజుల పాటు సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా మార్తాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది.
మార్తాడు గ్రామంలో పర్యటిస్తున్న పవన్ కుమార్ రెడ్డి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గత నాలుగునర్రేళ్లుగా హామీలు ఇస్తూనే ఉన్నారని ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని...నాలుగున్నరేళ్లుగా నెరవేర్చని హామీలు నాలుగు నెలల్లో ఎలా నెరవేరుస్తారని పవన్ కుమార్ రెడ్డిని తాతిరెడ్డి అనే వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు ఎంపీ కొడుకు పవన్ కుమార్ రెడ్డి బూతుపురాణం అందుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకే కాదు పవన్ కుమార్ రెడ్డికి కూడా నోరు అదుపులో ఉండదని అక్కడి గ్రామస్తులు చెవులు కొరుక్కున్నారు. పవన్ రెడ్డి ఆవేశం చూసి గ్రామస్తులు బిత్తరపోయారు.
పవన్ పర్యటన సందర్భంగా అక్కడికి రైతులు చేరుకుని తమ పొలాలకు నీరు ఇవ్వాల్సిందిగా కోరారు. నీరు ఇవ్వకుంటే తమలాగే తమ పిల్లలు కూలి పని చేసుకోవాల్సి వస్తుందని పవన్కుమార్తో చెప్పారు. మీ ప్రాంతానికి నీరే కాదు పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని పవన్ కుమార్ చెప్పడంతో... ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా తాతిరెడ్డి కోరాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న పవన్ కుమార్ రెడ్డి తాతిరెడ్డిపై చిందులు వేశారు. బూతుపురాణం అందుకున్నారు. విదేశాల్లో చదువుకున్న పవన్కుమార్ రెడ్డి సంస్కారం లేకుండా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారు ఇక ప్రజాసమస్యలు ఎలా నెరవేరుస్తారంటూ చాలా మంది గుసగుసలాడటం కనిపించింది.