అలిపిరి మెట్ల మార్గంలో అతి సమీపంలో కనిపించిన చిరుత- బిగుసుకుపోయిన భక్తులు

Tirumala: గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం మళ్లీ ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించింది. దీంతో ఈ మార్గంలో తిరుమలకు వెళ్తోన్న భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మెట్ల మార్గానికి అతి సమీపంలో చిరుత ప్రత్యక్షం కావడంతో భయంతో బిగుసుకుపోయారు. కేకలు వేస్తూ, శబ్దం చేస్తూ దాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రత చర్యలు చేపట్టారు.

Advertisement

తిరుపతి- తిరుమల మెట్ల మార్గంలో చిరుత కనిపించడం పరిపాటిగా మారింది. ఇదివరకు కూడా అలిపిరి నడక దారిలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. 350వ మెట్టు సమీపంలో, అలిపిరి- శ్రీవేంకటేశ్వర జూ పార్క్ మార్గంలో, శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలో అది సంచరించింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పట్లో. ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుత కనిపించడం కలకలం రేపింది. శ్రీవారి భక్తుల్లో భయాందోళనలను నింపింది.

Advertisement

ఈ తెల్లవారు జామున తిరుమలకు వెళ్తోన్న శ్రీవారి భక్తులు అలిపిరి కాలి బాట వద్ద శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో సమీప పొదల్లో చిరుతను గుర్తించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటూ ఇటు పరుగులు తీశారు. గట్టిగా కేకలు వేశారు. ఐరన్ రాడ్లతో శబ్దం చేయడం కనిపించింది. ఆ వెంటనే ఈ విషయాన్ని టీటీడీ అటవీ విభాగం సిబ్బంది తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది భద్రత చర్యలు చేపట్టారు. దీని కదలికపై నిఘా పెట్టారు.

అలిపిరి కాలినడక మార్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఇదివరకే అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా చిరుత సంచారాన్ని పసిగడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తోన్నారు. ప్రస్తుతానికి ఇది అలిపిరి పరిసర ప్రాంతాల్లోనే తిరుగాడుతుండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. కాలినడకన తిరుమలకు రాకపోకలు సాగిస్తోన్న భక్తులకు జాగ్రత్తలను సూచించారు. శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Advertisement

గత నాలుగేళ్లుగా చిరుతల సంచారం బాగా పెరిగింది. అలిపిరి, శ్రీవారిమెట్టు, గాలి గోపురం పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి అప్పట్లో. వాటిని కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు.

గతంలో నెల్లూరుకు చెందిన ఓ బాలిక.. చిరుత దాడిలో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి చిరుతల బెడద మొదలైంది. దీన్ని నివారించడంపై టీటీడీ ఇప్పటికే దృష్టి సారించింది. అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చడానికి కెమెరా ట్రాప్స్, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్ లైట్లు, పెప్పర్ స్ప్రేలు.. తదితర వస్తువులను రక్షణ పరికరాల వినియోగించేలా నిర్ణయం తీసుకుంది.

English Summary

Leopard Spotted Near Sri Narasimha Swamy Temple, Alipiri, Tirumala Devotees Gets Panic Intensify security. Patrols were intensified to improve safety while people were moved to safety without incident. The situation was managed with coordinated monitoring.