అమరావతి: పోలవరం గ్యాలరీ వాక్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరు అద్భుత దృశ్యాలను తమ మొబైల్లో బంధించారు. అంతేకాదు, వారిద్దరు సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని లోకేష్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసారు. వారు సెల్ఫీ తీసుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలవరం గ్యాలరీ వాక్కు వెళ్లిన లోకేశ్ను మీడియా పలకరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఇదొక చరిత్ర అన్నారు. భారతదేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఒక తరం ప్లాన్ చేస్తుందని, రెండో తరం డిజైన్ చేస్తుందని, మూడో తరంలో శంకుస్థాపన చేస్తుందని, నాలుగో తరంలో నిర్మాణం అవుతుందని, అయిదో తరంలో ప్రారంభిస్తారని, ఇలా ప్రాజెక్టులు పూర్తి కావడానికి తరాలు అవుతాయన్నారు.
కానీ కేవలం నాలుగేళ్లలోనే పూర్తి చేస్తున్నామని చెప్పారు. అధికారులు, కాంట్రాక్టర్లు అందరి సహకారం వల్ల ఈ ప్రాజెక్టు 58 శాతం పూర్తయిందని, పోలవరం ఏపీకి జీవనాడి అన్నారు. దేవుడి దయవల్ల, చంద్రబాబు దయవల్ల, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రాజెక్టును సందర్శించే అవకాశం కలిగిందన్నారు. ఇలాంటి అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.