ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగానికి గేమ్చేంజర్గా మారనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మెగా ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో పాటు జీఎంఆర్ గ్రూప్ అధినేతలు పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న టెర్మినల్ భవనాన్ని, చెక్-ఇన్ హాళ్లను ప్రధాని మోదీ సవివరంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఆయన పడుతున్న శ్రమను కొనియాడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
"ఆంగ్లేయుల పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. 'ఈ నేల ఎవరికీ బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికీ తలవంచదు' అని సవాల్ విసిరిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన పేరును ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం ఏపీ ప్రజలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది కేవలం ఆయనకు ఇచ్చే నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను భావితరాలకు అందించే గొప్ప నిర్ణయం. అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ఆంధ్రప్రదేశ్ ఇక ప్రపంచంతో పోటీపడనుంది," అని పవన్ అన్నారు. అలాగే జీఎంఆర్ గ్రూపు స్వదేశీ సాంకేతికత, అంకితభావంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించడం తెలుగువారందరికీ గర్వకారణమని ప్రశంసించారు. కేవలం ప్రకటనలు గుప్పించినంత మాత్రాన ఏ దేశమూ, రాష్ట్రమూ అభివృద్ధి చెందవని పవన్ స్పష్టం చేశారు. "ప్రజల కలలను సాకారం చేసే మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే నిజమైన వికాసం సాధ్యమవుతుంది. చరిత్ర మనం నిర్మించిన కట్టడాలను మాత్రమే కాదు.. ఆ కట్టడాల ద్వారా మనం నిర్మించిన భవిష్యత్తును గుర్తుంచుకుంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈరోజు ఏపీకి రూ.17,435 కోట్ల విలువైన జాతీయ రహదారులు, అభివృద్ధి ప్రాజెక్టులు లభించాయి. విశాఖకు రూ. 2 లక్షల కోట్లు, అమరావతికి రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. ఒకప్పుడు కనీసం ఎర్రబస్సు కూడా సరిగ్గా రాని ప్రాంతానికి ఈరోజు 'ఎయిర్ బస్' వచ్చే స్థాయికి మనం చేరుకున్నాం," అని పవన్ వివరించారు. ప్రధాని మోదీపై కొందరు చేస్తున్న విమర్శలపై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని చెబుతూ.. "ఒకప్పుడు భారతదేశం తన పరువు కాపాడుకోవడానికి బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి ఉండేది. అలాంటి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీది. ప్రధాని అయినప్పటి నుంచి ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా శ్రమిస్తున్నారు. ఒకవైపు సరిహద్దుల్లోని విదేశీ శత్రువులతో, మరోవైపు దేశంలో ఉన్న అంతర్గత శత్రువులతో ఆయన పోరాటం చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద ఆయనను కొందరు దారుణమైన మాటలు అన్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఈ కొత్త తరానికి ఆయన కష్టం ఏం తెలుసు? 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని నడిపించడమంటే సామాన్యమైన విషయం కాదు, అదొక 'రామకార్యం'. నరేంద్ర మోదీని రాజకీయంగా కొట్టేవాడు ఈ దేశంలో లేడు, ఇకపై రాబోడు! అందుకే దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నేను ఎంతో బలవంతంగా ఈ పొత్తు కోసం ప్రయత్నించాను," అని పవన్ వ్యాఖ్యానించారు. మోదీ తనను విమర్శించిన వారిని కూడా క్షమించేంత గొప్ప మనసున్న నాయకుడని పవన్ అభివర్ణించారు. "వేలాది మంది తిడుతున్నా, విమర్శిస్తున్నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక సామర్థ్యం మోదీకి ఉంది. 25 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు నాదొకటే విజ్ఞప్తి.. మన పిల్లలకు దేశం కోసం కష్టపడే నాయకుల విలువను వివరించి, వారిని సరైన మార్గంలో పెట్టడం మనందరి బాధ్యత," అని పిలుపునిచ్చారు. ప్రసంగం ముగింపులో ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తున్నట్లు తెలిపిన పవన్ కల్యాణ్.. "దేశ ప్రజలు వద్దంటేనే మీరు అధికారం దిగాలి తప్ప, మిమ్మల్ని కుర్చీ నుంచి దించే మగాడు ఈ దేశంలోనే లేడు. మా మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుంది," అని స్పష్టం చేశారు.'ఈ నేల ఎవరికీ తలవంచదు'.. అల్లూరి పేరుతో నవశకం!
భోగాపురం జాతికి అంకితం - ప్రధాని మోదీ వేదికపై ప్రత్యేకంగా..!!
రూ.17,435 కోట్ల వృద్ధి బాట.. అభివృద్ధే లక్ష్యం!
'మోదీని అన్న మాటలకు కన్నీళ్లొచ్చాయి': పవన్ ఆవేదన
ప్రధాని మోదీ భోగాపురంలో ఎంట్రీ వేళ, కొత్త చరిత్ర..! (వీడియో)
తల్లిదండ్రులకు విజ్ఞప్తి.. ప్రధానికి పాదాభివందనం!