ప్రధాని మోదీకి అరుదైన స్వాగతం లభించింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కోసం ప్రధాని ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానికి స్వాగతం పలికారు. అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర ప్రారంభం కానుంది.
ప్రధాని మోదీ రాక వేళ ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భోగాపురం చేరుకున్న ప్రధాని కి అరుదైన రీతిలో ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి మోదీ సుమారు 12 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని తిలకించనున్నారు. విమానాశ్రయం లోపల తోలుబొమ్మల కళ, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, భౌగోళిక వారసత్వాన్ని ప్రతిబింబించే బంగినపల్లి మామిడి వంటి కళా చిత్రాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. అలాగే విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయం ప్రారంభం వేళ భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేకంగా వీవీఐపీ గ్యాలరీలో ఆతిధ్యం ఇస్తున్నారు.
ప్రధాని మోదీకి గిరిజనుల సంప్రదాయ 'థింసా' నృత్యంతో ఘన స్వాగతం పలుకుతు న్నారు. ఏకరూప దుస్తుల్లో వేలాది మంది కళాకారులు పాల్గొన్న థింసా నృత్య రిహార్సల్ ఇప్పటికే అతిపెద్ద థింసా నృత్య ప్రదర్శనగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 లక్షల మంది తరలివస్తారని, అంచనా వేస్తున్నారు. 3 వేల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ఇదే సమయంలో విమానాశ్రయం టెర్మినల్ భవనం ప్రారంభించిన తర్వాత ఇంధన, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన రూ.18 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.