ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం - ఎన్నికల సంఘం ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. కూటమి పార్టీలు ఈ ఎన్నికల పైన సమాలోచనలు చేస్తున్నాయి. అటు వైసీపీ ఈ ఎన్నికలను ప్రతి ష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికలకు ఈవీఎంలా.. బ్యాలెట్ బాక్సులను వినియోగించాలనే అంశం పైన జరుగుతున్న కసరత్తు కీలకంగా మారుతోంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అటు ఎన్నికల సంఘం.. ఇటు రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు సైతం ఈ ఎన్నికల కోసం క్షేత్ర స్థాయి లో సిద్దం కావాలని నిర్దేశించారు. ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో కూటమి పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇటు వైసీపీ సైతం ఇప్పటికే స్థానిక ఎన్నికలకు కార్యాచరణ అమలు మొదలు పెట్టింది. కాగా.. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్చంద్ర పునేఠా అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఏమేం ఏర్పా ట్లు చేశారు.. ఇంకా ఏం పనులు పెండింగ్లో ఉన్నాయి.. వాటి పూర్తికి ఏం చర్యలు తీసుకున్నారో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 23 చోట్ల మరియు 13,359 పంచాయతీలకు గానూ 354 చోట్ల న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
విశాఖ - విజయవాడ- తిరుపతి రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఇక నుంచి కొత్తగా..!!
కాగా, ఈ న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి, అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా లీగల్ టీమ్లతో చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఓటర్ల జాబితాలను ఇప్పటికే పంచాయతీల్లో ప్రకటించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక రావలసి ఉందని, వచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో సాంప్రదాయ బ్యాలెట్ కాగితాలను వినియోగించాలా లేక ఈవీఎం (EVM)ల వైపు వెళ్లాలా అనే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల నిర్వహణ వ్యయం, భద్రత మరియు సమయాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలోనే పోలింగ్ పద్ధతిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈవీఎంల పైన సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. కొందరు సందేహాలు వ్యక్తం చేసారు. ఈ క్రమంలో బ్యాలెట్ వినియోగం పైనా డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో.. ఈ ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.ఎన్నికల కమిషన్ కసరత్తు