పరిటాల కుటుంబం నుంచి నాకు ప్రాణహాని : తోపుదుర్తి అరెస్ట్

అనంతపురం జిల్లా రాజకీయాల్లో హైటెన్షన్ నడుస్తుంది. ఒకవైపు జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ మరో వైపు పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీల మధ్య అధిపత్య పోరు జిల్లా పోలీసులుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా రప్తాడు రాజకీయం రణరంగాన్ని తలపించింది.. సీమలో సెగలు పుట్టించే వేడి రాజుకుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య నెలకున్న మాటల యుద్ధం నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపింది. తోపుదుర్తిని అంతం చేయడానికి కుట్ర జరుగుతోందని, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం, తాజాగా తన ఇంటిపైకి టీడీపీ నేతలు రావడం ఇందుకు సంకేతాలని వైసీపీ ఆరోపిస్తుంది

Advertisement

గురువారం రాప్తాడు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టుతో ఈ హైటెన్షన్ పతాక స్థాయికి చేరింది. తన హత్యకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని తోపుదుర్తి ఆరోపించగా, ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం అనంతపురంలో తీవ్ర పొలిటికల్ హీట్‌ను పెంచింది.

Advertisement

వివాదానికి కేంద్ర బిందువుగా 'ఇల్లు'

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య నడుస్తున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. తోపుదుర్తి ప్రస్తుతం అద్దెకు నివసిస్తున్న ఇంటిని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ₹2.85 కోట్లకు కొనుగోలు చేసేందుకు యజమానితో అగ్రిమెంట్ చేసుకోవడం సంచలనంగా మారింది. తాను మంత్రి నారా లోకేష్ బినామీ అన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన విమర్శలు నిరూపించాలంటూ మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. నేరుగా తోపుదుర్తి నివాసానికే వస్తానని ఆయన ప్రకటించడం, దీనికి ప్రతిగా తోపుదుర్తి కూడా కార్యకర్తల సమావేశానికి పిలుపునివ్వడంతో ఇరు పార్టీల మధ్య వాతావరణం వేడెక్కింది.

Advertisement

తోపుదుర్తి, గోరంట్ల మాధవ్ అరెస్ట్

సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య రంగంలోకి దిగిన పోలీసులు అనంతపురం శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అడ్డుకుని అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తున్న క్రమంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ఆయనతో పాటు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సైతం పోలీసులు అరెస్టు చేసి, తోపుదుర్తి స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తీవ్ర తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది. తోపుదుర్తి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించి ఇతరులకు అనుమతి నిరాకరించారు.

Advertisement

ఆందోళనలు.. నేతల గృహనిర్భంధాలు

తోపుదుర్తి అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ధర్నాలకు దిగాయి. ప్రకాష్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌ను, హిందూపురం సమన్వయకర్త దీపికను పోలీసులు పెనుకొండ వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఉషాశ్రీచరణ్ రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్ర బాబు, కాలువ శ్రీనివాసులు తదితరులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి చేరుకోవడంతో అక్కడ కూడా పొలిటికల్ హీట్ పెరిగింది.

పరస్పర ఆరోపణల పర్వం

మంత్రి నారా లోకేష్ సహకారంతో దళిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజును అడ్డుపెట్టుకుని పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్ర బాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగంతో తన కుటుంబ సభ్యులను సైతం బెదిరిస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఎంపీ బీకే పార్థసారథి స్పందిస్తూ.. కంపెనీ టిప్పర్, తోపుదుర్తి వాహనం ఎదురుపడటం కేవలం యాదృచ్ఛికమని, దాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. మొత్తానికి అరెస్టులు, పోలీసుల మోహరింపులతో రాప్తాడు సహా అనంతపురం పరిసర ప్రాంతాలు ఇప్పటికీ నిప్పులు కురిపించే పొలిటికల్ జోన్‌లా మారాయి.

English Summary

High political tension gripped Anantapur as police arrested YSRCP ex-MLA Thopudurthi Prakash Reddy and former MP Gorantla Madhav. The arrest followed a heated war of words with TDP MLA MS Raju over a house agreement and conspiracy allegations in Raptadu.