ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత- ఏం జరుగుతోంది

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ ఉదయం నుంచీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు, మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భూ అక్రమాలు, అధికారుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించ తలపెట్టింది. ఈ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. మరికొందరని గృహ నిర్బంధంలో ఉంచారు.

Advertisement

నియోజకవర్గం పరిధిలోని విడపనకళ్ మండలం వేల్పుమడుగులో వైఎస్ఆర్సీపీ నాయకుడు గోవింద్‌కు చెందిన 21 ఎకరాల భూమి వ్యవహారం దీనికి కారణమైంది. ఈ భూమిపై పయ్యావుల కేశవ్ కావాలనే వివాదం సృష్టిస్తున్నారంటూ నేడు భారీ ధర్నాకు పిలుపునిచ్చారు పార్టీ నాయకులు. ఈ భూమిపై పయ్యావుల కేశవ్ కన్నేశారని, అందుకే ఉద్దేశపూరకంగా వివాదం రేపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ ఛార్జ్ వై విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.

Advertisement

ఆ భూమి ప్రైవేటు ఆస్తేనంటూ రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని విశ్వేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైకోర్టు కూడా గోవింద్ కు అనుకూల ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రైవేటు ఆస్తులపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ధ్వజమెత్తారు.

సీఎం డీకే శివకుమార్ టీమ్ ఫైనల్: కేబినెట్ బెర్తులు కన్ ఫర్మ్- క్యాస్ట్ ఈక్వేషన్స్
Advertisement

చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు, పోలీసులు అధికార పార్టీ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరైంది కాదని వైయస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. అరెస్టులు, హౌస్‌ అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

బీజేపీ సీనియర్ నేత బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్ల వేధింపు కేసులో కోర్టు తుది తీర్పు

ధర్నా ప్రారంభానికి ముందే పెద్ద ఎత్తున పోలీసులు ఉరవకొండకు చేరుకున్నారు. దీనికి నేతృత్వం వహించిన విశ్వేశ్వరరెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరి రావాల్సిన మాజీ మంత్రి శంకర్‌ నారాయణను పోలీసులు పెనుకొండలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

English Summary

Tension continues in Uravakonda as former YSRCP MLA Y Visweswara Reddy stages a dharna against Finance Minister Payyavula Keshav. The opposition alleged that police stopped former MP Gorantla Madhav from joining the protest and detained him.