కలియుగ వైకుంఠం తిరుమల.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతోంది. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం చకచకా ఏర్పాట్లు చేపట్టింది. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించింది. దీనికి సంబంధించిన తేదీలు వెలువడ్డాయి కూడా. సెప్టెంబర్ లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంది టీటీడీ.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. సెప్టెంబర్ 8వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే నెల 14 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 15న ధ్వజారోహణం ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. 22వ తేదీన శ్రీవారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. 23న పుష్కరిణీలో చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటలు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. ఈ తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. వీటికి ఎటువంటి అనుమతి ఉండదు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దయ్యాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది టీటీడీ. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఇదివరకే అధికారులు ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ పనులు చేపడతారు. గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశం. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. గరుడసేవకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 18 రాత్రి 9 నుండి 20వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని వెంకయ్య చౌదరి సూచించారు.నాగ పంచమి ఎప్పుడు, ఏ రోజున జరుపుకోవాలి
విజయ్- ఉదయనిధి: ఢీ అంటే ఢీ: ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదు