తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం.. వరుస సెలవులు కావటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. తిరుమలలో క్యూ లైన్లలో గంటల తరబడీ దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తుల కోసం టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇక సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి క్యూ లైన్ల లో వేచి చూస్తున్న భక్తులకు ప్రయోజనకరంగా మారనుంది.
తిరుమలకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక, పండుగలు.. సెలవుల రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ఆ సందర్భాల్లో క్యూకాంప్లెక్స్లు, క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. వారికి శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను చేరవేస్తుంటారు. అయినప్పటికీ.. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో క్యూ లైన్లలో ఉన్న భక్తులకు వేగంగా ప్రసాదాలు అందించటం కష్టంగా మారుతోంది. దీంతో.. వీరి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. రద్దీ రోజుల్లో దాదాపు 3.5 కిలో మీటర్ల మేర భక్తుల క్యూ లైన్లు విస్తరించి ఉంటున్నాయి. వీరికి నిత్యం శ్రీవారి సేవకులు పాలు, మజ్జిగ, నీళ్లతో పాటు ఉప్మా, పులిహోర, సాంబారన్నం, టమోటా రైస్ వంటి పదార్థాలను లక్ష పోర్షన్ల మేర భక్తులకు అందజేస్తున్నారు.
విశాఖ - విజయవాడ- తిరుపతి రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఇక నుంచి కొత్తగా..!!
ఇక, ఇప్పుడు ఈ తాజా నిర్ణయంతో ప్రసాద వితరణ మరింత సలభంగా మారనుంది. దాతల సాయం తో ఈ మూమింగ్ డైనింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. శిలాతోరణం సమీపం లోని 45వ గేటు వద్ద ఈ ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ పనితీరును టీటీడీ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. శ్రీవారి సేవకులు ఈ కన్వేయర్ యంత్ర సహాయంతో భక్తులకు సులువుగా ప్రసాదాలను పంపిణీ చేస్తుండటంతో ఈ విధానం మరిన్ని ప్రాంతాల్లోనూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పొడవు 7 మీటర్లు ఉంటుంది. అచ్చం కన్వేయర్ బెల్ట్ మాదిరిగా ఇది నిరంతరాయంగా గుండ్రంగా కదులుతూనే ఉంటుంది. ఈ విధానం వల్ల అటు భక్తులకు, ఇటు అన్నప్రసాదాలు పంపిణీ చేసే సేవకులకు ఎంతో సమయం ఆదా కానుంది. పంపిణీలో ఎలాంటి తోపులాటలకు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. క్యూలైన్లలోని మిగిలిన కీలక ప్రాంతాల్లో కూడా మరిన్ని ఫుడ్ సర్వింగ్ కన్వేయర్లను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.భక్తులకు వెసులుబాటు