తిరుపతి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల హాస్టల్ నిర్వహణపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. మౌలిక వసతులు కల్పించడంలో టీటీడీ విఫలమైందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. హాస్టల్ పరిధిలోని శాంభవి, ప్రణతి బ్లాకుల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు అధ్వాన్న దశకు చేరుకున్నాయని, వాటిని ఏ మాత్రం వినియోగించలేని స్థితిలో ఉన్నాయంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫోటోలను వైరల్ చేస్తున్నారని, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
కళాశాల హాస్టల్ భవనాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ పోస్టులు విద్యార్థినుల తల్లిదండ్రులలో ఆందోళనకు కారణమయ్యాయి. ఈ పరిణామంపై టీటీడీ స్పందించింది. దీనిపై పూర్తి వాస్తవాలను వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అక్కడ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిని ఉద్దేశపూరకంగా ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోన్నారని అధికారులు పేర్కొన్నారు.
శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోన్నామని వివరించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం హాస్టల్ ప్రాంగణంలోని శాంభవి, ప్రణతి బ్లాక్ లల్లో స్నానపు గదులు, మరుగుదొడ్ల ఆధునికీకరణ, పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్మాణ దశలో ఉండి, సిమెంట్లు, ఇతర సామగ్రితో ఉన్న ఆ ప్రాంతాన్ని కొందరు దురుద్దేశపూర్వకంగా ఫోటోలు తీసి, అవి వాడకానికి వీల్లేని స్థితిలో ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేశారని టీటీడీ వివరించింది. ఇలాంటి తప్పుడు వార్తల వల్ల విద్యార్థులు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని టీటీడీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. ప్రతిష్టకు భంగం కలిగించేలా, విద్యార్థుల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. అవాస్తవాలను ప్రచారం చేసిన వ్యక్తులను ఇప్పటికే ఐటీ విభాగం సహాయంతో గుర్తిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా దుష్ప్రచారానికి ఒడిగట్టిన వారిని గుర్తించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడబోమని టీటీడీ హెచ్చరించింది.మెగా హీరో లేటెస్ట్ ఫిల్మ్ ట్రైలర్ కట్.. గ్రిప్పింగ్: హిట్ గ్యారంటీ