ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. గురువారం నాడు 67,063 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,565 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.81 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.27 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.53 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,166 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ సన్నద్ధమౌతోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా తిరుమల, తిరుపతికి అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం తీసుకోవాల్సిన సౌకర్యాలపై టీటీడీ జేఈవో డాక్టర్ ఎ శరత్ సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈ సమావేశం ఏర్పాటైంది. వివిధ విభాగాల అధిపతులు, చీఫ్ ఇంజినీర్లు దీనికి హాజరయ్యారు. భక్తుల వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి, పరిసర ప్రాంతాల్లో తగిన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేయాలని, వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకుని రావాలని ఈ సందర్భంగా శరత్ సూచించారు. పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ద తగిన సంఖ్యలో మొబైల్ మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్య ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. స్థానిక ఆలయాలు, ప్రధాన భవనాలు, రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చేయాలని ఆయన అన్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్, అలిపిరి నడక మార్గం, విష్ణునివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో అదనపు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని శరత్ ఆదేశించారు. మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య ప్రాజెక్టులో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో శ్రీవారి సేవకులను నియమించాలని చెప్పారు.నేటి నుంచే.. వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు సవరణ- అమలు
బంగారం ధరలు రీబౌండ్- భయపెడుతున్న పరిణామాలు