పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా తగినంత ఇంధన సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ట్యాక్స్ లను తాజాగా సవరించింది. క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న భారీ మార్పుల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ పై వసూలు చేస్తోన్న ప్రత్యేకంగా వసూలు చేస్తోన్న అదనపు ఎక్సైజ్ ట్యాక్స్, రోడ్లు, ఇతర మౌలిక వసతుల సెస్ రేట్లను కేంద్రం సవరించింది.
అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశీయ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ ఏడాది మార్చి 27 నుండి ఇంధన ఎగుమతుల సుంకాల సవరణను మొదటిసారిగా అమలులోకి తీసుకువచ్చింది. అప్పటి నుండి ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా చమురు ఎగుమతి పన్నులను అధికారులు సమీక్షిస్తున్నారు.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్పై సుంకాన్ని లీటరుకు రూ. 3.50 పైసలుగా నిర్ణయించారు. ఇది ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలోనే వసూలు అవుతుంది. దీనిపై అదనంగా ఎటువంటి సెస్ వర్తించదు. డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 25.50 పైసలుగా ఖరారు చేసింది కేంద్రం. ఇందులో లీటరుకు రూ. 24 ల వరకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ కాగా, మిగిలిన రూ. 1.50 పైసల మొత్తాన్ని రోడ్లు- ఇతర మౌలిక వసతుల సెస్ కింద వసూలు చేస్తారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై సైతం లీటరుకు రూ. 22 మేర అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని విధించింది కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా పన్ను సవరణల వల్ల సాధారణ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వాహనదారులు వినియోగించే రిటైల్ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు, వాటిపై విధించే సాధారణ ఎక్సైజ్ విధింపుపైనా వీటి ప్రభావం ఎంతమాత్రం ఉండదని పేర్కొంది. కిందటి నెల 16 నాటి సరవణలతో పోల్చుకుంటే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు సగటు విక్రయ ధరల్లో నెలకొన్న అస్థిరతను విశ్లేషించిన తరువాతే కేంద్రం ఈ మార్పులను ఖరారు చేసింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే పద్ధతిని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.స్టార్ ఆల్ రౌండర్ రెడ్డికి బిగ్ షాక్: ఏకంగా 8 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించిన ఐసీసీ