కేంద్రం నిర్ణయంతో బండ్లు ఇక షెడ్డుకే.. !!

దేశంలో వాహనదారులను ఇప్పుడు ఓ నూతన ఆందోళన తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి (E20) పెంచడం వల్ల పాత వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా, ఇంజిన్ ముడిభాగాలు వేగంగా దెబ్బతింటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 2023 కంటే ముందు తయారైన నాన్-ఈ20 వాహనాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఇది ఇంధన సామర్థ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇంజిన్ దీర్ఘకాలిక మనుగడకు కూడా ముప్పుగా మారుతోంది.

Advertisement

ప్రముఖ సర్వే సంస్థ 'లోకల్ సర్కిల్స్' దేశవ్యాప్తంగా 305 జిల్లాల్లోని సుమారు 44,000 మందికి పైగా పెట్రోల్ వాహనదారుల అభిప్రాయాలను సేకరించింది. ఓ సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. చాలామంది వాహనదారులు తమ పాత వాహనాల నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. 2025 ప్రారంభం నుండి తమ వాహనాల రిపేర్లు, ఇంజిన్ అరుగుదల పెరిగిందని దాదాపు 55 శాతం మంది స్పష్టం చేశారు. అంతకుముందు నెలతో పోలిస్తే ఈ ఫిర్యాదులు భారీగా పెరగడం ఆందోళనకరం.

Advertisement

పాత ఇంజిన్లపై ఇథనాల్ ప్రభావం ఎందుకు?

ఇథనాల్‌కు ఉన్న రసాయనిక స్వభావం కారణంగా అది గాలిలోని తేమను చాలా సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల ఇంధన ట్యాంకులు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులు, లోహపు ఇంధన పైప్ లల్లో తుప్పు పట్టే ప్రమాదం భారీగా పెరుగుతుంది. దీనికి అదనంగా.. ఈ20 ఇంధన వినియోగానికి అనుకూలంగా లేని పాత వాహనాల్లోని రబ్బర్ హోస్‌, సీల్స్, ప్లాస్టిక్ విడిభాగాలను కూడా ఇది క్రమంగా క్షీణింపజేస్తుంది. దీనివల్ల వాహనదారులు ఊహించని విధంగా భారీ రిపేర్ బిల్లులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

మరోవైపు.. వాహనాల మైలేజీపై ఫిర్యాదులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ఇంధనంతో పోలిస్తే ఇథనాల్‌లో తక్కువ సాంద్రత ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆధునిక ఈ-20 వాహనాల్లో ఉండే అడాప్టివ్ ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పాత వాహనాల్లో ఉండదు. అందువల్ల ఇంజిన్లు అదే పనితీరును ప్రదర్శించడానికి ఎక్కువ ఇంధనాన్ని దహించాల్సి వస్తుంది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 66 శాతం మంది తమ వాహనాల మైలేజీ 10 శాతానికి పైగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

నిపుణుల అంచనాలు - క్షేత్రస్థాయి వాస్తవాలు

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) అంచనాల ప్రకారం.. ఇథనాల్ పెట్రోల్ వల్ల ఆరు శాతం మేరకే మైలేజీ తగ్గాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. పాత వాహనాలలో మైలేజీ తగ్గుదల రేటు 8 నుండి 12 శాతం వరకు ఉన్నట్లు స్పష్టమౌతోంది. గత 15 ఏళ్లలో దేశంలో విక్రయించిన పెట్రోల్ వాహనాల్లో కేవలం 20 శాతం మాత్రమే ఇథనాల్ ఇంధనానికి అనుకూలంగా ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఈ22, ఈ25, ఈ27, ఈ30 వంటి మరింత ఎక్కువ ఇథనాల్ మిశ్రమాలను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సాధారణ పెట్రోల్ లభ్యత పూర్తిగా తగ్గిపోతే, పాత వాహనదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడం ఖాయంగా కనిపిస్పతోంది.

English Summary

Owners Say E20 Fuel Cuts Mileage, Mechanical Issues Rise Sharply Engine Efficiency Hit Seems Worse. Among those reporting problems, 24 per cent described the increase in repairs as major , while another 21 per cent called it moderate . Only 38 per cent said they had noticed nothing unusual.