భోపాల్: ఓ వ్యక్తి గత ఎనిమిదేళ్లలో ఏఖంగా 33 మంది ట్రక్ డ్రైవర్లను చంపిన సంఘటన వెలుగు చూసింది. అతనిని అరెస్టు చేసిన పోలీసులు, అతని గురించి తెలిసి అవాక్కయ్యారు. నిందితుడు టైలరింగ్ చేస్తాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏకంగా ట్రక్కు డ్రైవర్లను చంపేశాడు.
ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని మండీదీప్ ప్రాంతంలో జరిగింది. ఆదేశ్ అనే 48 ఏళ్ల వ్యక్తి టైలరింగ్ వృత్తిలో ఉన్నాడు. ఈ పనిని వదులుకొని అంతర్రాష్ట్ర ముఠాతో పని చేశాడు. కాంట్రాక్టులు కుదుర్చుకొని హత్య చేశాడు.
రోడ్డు పక్కన ఉన్న దాబాలలో ట్రక్ డ్రైవర్లతో స్నేహం చేసి, వారి తినే ఆహారంలో డ్రగ్స్ కలిపేవాడు. వారు నిద్రపోయిన తర్వాత ట్రక్కును ఎవరు గుర్తించని ప్రాంతాలకు తీసుకువెళ్లి, డ్రైవర్ను, క్లీనర్లను చంపేసేవాడు. శవాలను అడవి ప్రాంతంలో వదిలేసేవాడు. ఆ తర్వాత ట్రక్కులలోని సరుకును అమ్మి సొమ్ము చేసుకునేవాడు. అతడికి కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు సహకరించాయి. ఆగస్ట్ 12న ఓ ట్రక్కు 50 టన్నుల ఇనుప రాడ్లతో భోపాల్కు బయలుదేరింది. కానీ గమ్యస్థానానికి చేరుకోలేదు. ఓనర్స్ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు డ్రైవర్ హత్యకు గురైనట్లుగా గుర్తించారు. కేసును పూర్తిగా తవ్వగా అసలు విషయం తెలిసిందే. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. వారు ఆదేశ్ గురించి చెప్పారు. అతను పేరు మార్చుకొని ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. ట్రక్కు డ్రైవర్లతో స్నేహం చేసి, డ్రగ్స్ లేదా మద్యం ఇచ్చి ఆ తర్వాత చంపేసేవాడు. తన కొడుకు చికిత్స కోసం చేసిన అప్పును తీర్చడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.