కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సంచలన ప్రకటన చేశారు. జూలై 6 సోమవారం మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్ లోని డివిజనల్ కమిషనర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బహిరంగ స్థలంలో జరిగే స్టూడెంట్ అవుట్ రేజ్ మార్చ్ లో తాను పాల్గొనేందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొని ఈ మార్చ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మార్చ్ జూలై 6 ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనలు 16 వ రోజుకు చేరుకున్నాయి. జూన్ 20న ప్రారంభమైన ఆందోళనలు 16 రోజులుగా సాగుతూనే ఉన్నాయి. నీట్ యూజీ 2026 పరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ లకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.
మరోవైపు ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఇదే ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజులుగా ఆయన దీక్షలోనే ఉన్నారు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు స్పష్టం అవుతోంది. నిరాహార దీక్ష కారణంగా సోనమ్ వాంగ్ చుక్ షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఆయన ఏకంగా ఆరు కిలోల బరువు తగ్గారు. సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యంపై వైద్యులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ఆయన బీపీ 112/70 గా ఉంది. అలాగే హార్ట్ రేటు నిమిషానికి 72 ఉంది. ఇక అతని హైడ్రేషన్ బాగానే ఉందని.. మానసిక స్థితి సరిగానే ఉందని తెలిపారు. సోనమ్ వాంగ్ చుక్ ఏడురోజుల్లోనే ఆరు కిలోలు తగ్గినట్లు పేర్కొన్నారు. ఇక సీజేపీ మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేస్తోంది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని రియా కుమారి తాపా తల్లిదండ్రులు నిరసన స్థలానికి వచ్చి మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే తెలిపారు. రియా కుమారి తండ్రి ఓ మాజీ ఆర్మీ అధికారి అని.. ఇలాంటి పేపర్ లీక్ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు దిప్కే స్పష్టం చేశారు.