కాక్రోచ్ జనతా పార్టీ(CJP) క్రమంగా విస్తరిస్తోంది: అభిజిత్ దిప్కే సంచలనం

నీట్ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెల రోజులకు పైగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జూలై 20న సీజేపీ చేపట్టిన 'ఛలో సంసద్' కార్యక్రమంలో భాగంగా లక్షలాదిమంది విద్యార్థులు పార్లమెంట్ వైపునకు దూసుకొచ్చారు. దాంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. అలాగే బాష్ప వాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

ఇక విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. కేంద్రం తీరుపై ప్రతిపక్ష పార్టీలు, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీని కేంద్రం నియమించింది. కేంద్ర ప్రభుత్వంపై కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన విజయంగా ఇది పరిగణించవచ్చు.

Advertisement

అయితే తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో సీజేపీ మరింత విస్తరిస్తుందని స్పష్టం చేశారు. " అవును.. కేంద్రంపై సీజేపీ విజయం తర్వాత ప్రస్తుతం సీజేపీ బాధ్యత మరింత పెరిగింది. ప్రజలకు మాపై ఆశలు పెరిగాయి. ఆగస్టు 5 బుధవారం రోజున మేము మీటింగ్ చేపట్టబోతున్నాం. ఆ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై రోడ్ మ్యాప్ సిద్దం చేయనున్నాం. ఈ సమావేశం నా నివాసంలోనే జరగనుంది" అని అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు.

"ఈ మీటింగ్ మా ఇంట్లో జరగనుంది. 10 నుంచి 15 మంది సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే మా ఇతర వాలంటీర్లతో ఈ అంశంపై చర్చించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలమని ఆలోచిస్తాం" అని అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులపై పెట్టిన నకిలీ ఎఫ్ఐఆర్ లను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నాం. విద్యార్థులను వేధించడం నిలిపివేయాలి.. అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పేర్కొన్నారు.