పైరసీల భాండాగారం: కేంద్రం డెడ్ లైన్

టాప్ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్.. మరోసారి కేంద్ర ప్రభుత్వ కఠిన చర్యలను ఎదుర్కొంటోంది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విచ్చలవిడిగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర ఓటీటీ కంటెంట్‌ను ఉచితంగా ప్రసారం చేస్తున్న ఛానెళ్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయా పైరేటెడ్ ఛానెళ్లను తొలగించడంతో పాటు తాము తీసుకున్న చర్యల వివరాలతో కూడిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) ను 15 రోజుల్లోగా అందజేయాలని టెలిగ్రామ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

Advertisement

దేశీయ చలనచిత్ర పరిశ్రమ, బ్రాడ్‌కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, నిర్మాతలు, పంపిణీదారుల వ్యాపార ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంది. టెలిగ్రామ్‌లో కొనసాగుతున్న వేలాది గ్రూపులు, ఛానెళ్లు పైరేటెడ్ కంటెంట్‌ను నిరంతరం ప్రసారం చేస్తూ చిత్ర పరిశ్రమ మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నాయని కేంద్రం భావించింది. ఇలాంటి కార్యకలాపాలకు వేదికగా మారుతున్న ఛానెల్‌లను వెంటనే గుర్తించి వెంటనే టేక్‌డౌన్ చేయడం అవసరమని ఈ నోటీసులో స్పష్టం చేసింది.

Advertisement

టెలిగ్రామ్‌కు ఇటువంటి నోటీసులు అందడం ఇది మొదటిసారేమీ కాదు. వినియోగదారుల వ్యక్తిగత ఫోన్ నంబర్లు బయటపడకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పించే యూజర్ నేమ్ ఫీచర్ కారణంగా దేశంలో మోసాలు, ఇతరుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించే (ఇంపర్సనేషన్) ముప్పు పెరుగుతోందని, దీనిపై వివరణ కోరుతూ రెండు రోజుల కిందటే టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌కు నోటీసులు జారీ చేసింది. తక్షణ వివరణ కోరింది.

ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారో మూడు రోజుల్లోగా తెలపాలని ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనికి ఒక రోజు ముందే అంటే 1న వాట్సాప్‌ కూడా తన కొత్త యూజర్ నేమ్ ఫీచర్ విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ, దేశ భద్రత దృష్ట్యా ఇటువంటి చర్యలు అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వంతో సంప్రదింపులు సంతృప్తికరంగా పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను ఆపాలని సూచించింది.

Advertisement

కిందటి నెలలో కూడా టెలిగ్రామ్ ఇబ్బందులను ఎదుర్కొంది. నీట్ యూజీ రీఎగ్జామ్ సమయంలో లీకైన ప్రశ్నపత్రాల వివరాలు, వాటికి సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద దీన్ని తాత్కాలికంగా నిషేధించింది కేంద్రం. మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పట్లో ప్లే స్టోర్ లో కూడా ఈ యాప్ అందుబాటులో లేకుండా పోయింది. జూన్ 30న టెలిగ్రామ్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు పైరసీ విషయంలో నోటీసులను అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English Summary

After WhatsApp, Telegram Faces Central Government Notice Over Piracy and Username Fraud Concerns. The notice directs Telegram to take down channels found to be distributing pirated content, as part of the government's action to protect India's film industry, OTT platforms.