33 వేల అడుగుల నుంచి ఉన్నట్టుండి 300 అడుగులు కిందికి జారిన ఎయిరిండియా విమానం

ఎయిరిండియా విమానానికి ముప్పు తప్పింది. థాయ్ లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఏఐ2379 ఫ్లైట్ గగనతలంలో కుదుపులకు గురైంది. టర్బులెన్స్ ను ఎదుర్కొంది. వాటి బారిన పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో విమానం ఊహించని విధంగా ఊగిపోయింది. ఈ క్రమంలో విమానం సుమారు 300 అడుగుల మేర కిందికి జారింది.

Advertisement

ఈ ఘటనతో ఒక్కసారిగా విమానంలో హాహాకారాలు చెలరేగాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ కుదుపుల కారణంగా కొందరు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే గాయపడ్డ వారికి చికిత్స అందించడానికి, అవసరమైతే ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ లను సిద్ధం చేశారు.

Advertisement

ఏఐ 2379 విమానం ఈ ఉదయం 8:25 నిమిషాలకు ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. మార్గమధ్యలో సుమారు 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోన్న సమయంలో టర్బులెన్స్ బారిన పడింది. బలమైన ఈదురుగాలులు ఒక్కసారిగా విమానాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. అమాంతం 300 అడుగుల వరకు కిందికి దిగజారింది. అకస్మాత్తుగా అక్షాంశ, రేఖాంశాలను సైతం మార్చుకుందీ ఫ్లైట్.

త్రిష చిచ్చు: భగ్గుమంటోన్న తమిళనాడు: ఉదయనిధి అరెస్ట్ తో డీఎంకే రోడ్లపైకి: ఎక్కడికక్కడ

దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఊగిపోయారు. చెల్లాచెదురు అయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు గాయాలయ్యాయి. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించారు. విమానాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. నిర్ణీత సమయానికి అంటే.. ఉదయం 11:50 నిమిషాలకు ఈ ఫ్లైట్ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఎయిర్‌పోర్ట్‌ మెడికల్ స్టాఫ్, గ్రౌండ్ సిబ్బంది.. వారికి ప్రాథమిక చికిత్స అందించారు.

Advertisement

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, తీవ్ర గాయాలు గానీ కాలేదని ఇండియన్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఊహించని అవాంతరానికి చింతిస్తున్నామని పేర్కొంది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను విమానాశ్రయ సిబ్బంది ఎప్పటికప్పుడు అందించిందని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారని వెల్లడించింది.

English Summary

Air India flight from Phuket to Delhi encountered a turbulence-related incident mid-air on Monday, causing a brief change in altitude and leaving a small number of passengers and cabin crew with minor injuries, the airline confirmed.