సీఎం విజయ్ ను పిలుచుకొచ్చి కేఆర్ఎస్ డ్యామ్ ను చూపించగలరా?

కావేరి జలాల వివాదం కర్ణాటకలో మరోసారి తీవ్ర రాజకీయ సెగలు రేపుతోంది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ మండ్య జిల్లా శ్రీరంగపట్నంలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ వద్ద భారతీయ జనతా పార్టీ బీజేపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, మండలిలో విపక్ష నాయకుడు చలవాది నారాయణస్వామి, మాజీ మంత్రి సీటీ రవి, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు.

Advertisement

ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సును పణంగా పెట్టి తమిళనాడుకు నీటిని వదలడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప.. డీకే శివకుమార్‌కు సవాల్ విసిరారు. ఇప్పటికైనా చొరవ తీసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కేఆర్ఎస్ డ్యామ్‌ను చూపించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితులను వివరించాలని అన్నారు.

Advertisement

కర్ణాటకలో ప్రస్తుతం తాగునీటికే తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, భవిష్యత్తులో రాబోయే ముప్పును తమిళనాడు నేతలకు వివరించాలని అన్నారు. సుప్రీంకోర్టులో సరైన సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా తన వాదనలను వినిపించకపోవడం వల్లే కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాల్సి వస్తోందని విమర్శించారు. ఈ విషయంలో డీకే శివకుమార్ ప్రభుత్వం విఫలమైందంటూ యడ్యూరప్ప మండిపడ్డారు.

ఆ రోజున కర్ణాటకలో సంపూర్ణ బంద్- బెంగళూరులో రేపే కీలక భేటీ.. !!

కర్ణాటక రైతుల ప్రయోజనాలను కాపాడటం కంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం చుట్టూ తిరుగుతూ మంత్రివర్గ విస్తరణ పనుల్లోనే మునిగిపోయారని యడ్యూరప్ప ధ్వజమెత్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక నుంచి ఒక్క చుక్క నీరు కూడా తమిళనాడుకు వదలకూడదని చెప్పారు. అలా చేయకుండా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మేకేదాటు ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Advertisement
దయచేసి.. బెంగళూరుకు రావొద్దు: విజయ్ కు డీకే శివకుమార్ రిక్వెస్ట్: కర్ణాటకలో జన నాయగన్ నిలిపివేత

తమిళనాడు ప్రభుత్వంతో డీకే శివకుమార్ చేతులు కలిపి.. ఆ రాష్ట్రానికి నీటిని సరఫరా చేసేలా వ్యవహరిస్తున్నారని అశోక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోవడంతో పాటు ప్రభుత్వ ఖజానా కూడా ఖాళీ అయిందని విమర్శించారు. రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ప్రభుత్వ.. వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించట్లేదని, కనీసం కరవు ప్రాంతాలుగా కూడా ప్రకటించట్లేదని అన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరతపై కావేరి ట్రిబ్యునల్ కు రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో వివరించలేకపోయిందని చలవాది నారాయణస్వామి దుయ్యబట్టారు. రాజకీయాలు పక్కనబెట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నీటి విడుదలను నిలిపివేస్తే తాము పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు విజయేంద్ర సహా ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

English Summary

BY Vijayendra and Other Karataka BJP leaders Detained During Protest Over Cauvery Water Dispute at KRS Dam. He says "Despite the central government having issued a drought warning, the state government has not taken the necessary precautionary measures.