కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది. ఈ మేరకు నూతన మంత్రుల జాబితాపై పార్టీ అధిష్ఠానం తుది ఆమోదం తెలిపింది. కేబినెట్లో నూతనంగా 20 మందికి స్థానం లభించబోతోంది. బెంగళూరు లోక్ భవన్లో ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది.
మొత్తం 20 మందితో కూడిన ఈ జాబితాలో 12 మంది కొత్త వారికి అవకాశం లభించింది. మరో ఎనిమిది మంది పాత మంత్రులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ పూర్తి మంత్రివర్గ విస్తరణలో మహిళలకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదు. మహిళా కోటా కింద శాసన మండలి సభ్యురాలు గాయత్రి శాంతేగౌడకు మాత్రమే చోటు లభించింది.
కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన జాబితా ప్రకారం.. పీఎం నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాణి, కేఎస్ బసవంతప్ప, బీ నాగేంద్ర, టీ రఘుమూర్తి, జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాళ్ వైద్య, అజయ్ సింగ్, ఎన్ చలువరాయ స్వామి, కేఎం శివలింగే గౌడ, హెచ్సీ బాలకృష్ణ, గాయత్రి శాంతేగౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద్ కాశప్పనవర్, లక్ష్మణ్ సవాది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో పలువురు సీనియర్లు తిరిగి మంత్రివర్గంలోకి అడుగుపెడుతుండగా, మరికొందరు మొదటిసారి అవకాశం దక్కించుకున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు కర్ణాటక శాసనసభ, శాసనమండలిలో కీలకమైన పదవుల భర్తీని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. అసెంబ్లీ స్పీకర్గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్గా ఏఎస్ పొన్నన్న బాధ్యతలు చేపట్టనున్నారు. శాసనమండలి చైర్మన్గా సలీం అహ్మద్, డిప్యూటీ చైర్పర్సన్గా మాజీ మంత్రి ఉమాశ్రీ నియామకానికి హైకమాండ్ ఆమోద ముద్ర వేసింది. స్పీకర్ రేస్ లో మొదట దినేష్ గుండూరావు, టీబీ జయచంద్ర, ఆర్ వీ దేశ్ పాండే పేర్లు వినిపించినప్పటికీ.. చివరికి ఆ అవకాశం జీఎస్ పాటిల్ కు దక్కింది. ప్రస్తుతం కర్ణాటక కేబినెట్ లో ఇప్పటికే జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జార్కిహోళి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే.. మంత్రులు కొనసాగుతున్నారు. వీరికి నూతనంగా 20 మంది మంత్రులు జత కానున్నారు. కుల సమీకరణల ప్రకారం చూస్తే.. లింగాయత్, వక్కలిగలకు పెద్దపీట వేశారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఏడు బెర్తులు లభించాయి. లింగాయత్ -6, వక్కలిగలు- 5, కురుబ- 3, వాల్మీకి- 3, ముస్లిం- 3, క్రైస్తవులు- 1, ఉప్పర -1, మరాఠా- 1, ఈడిగ- 1, మొగవీరులు- 1, రాజపుట్- 1, రెడ్డి- 1 ఉన్నారు.తమిళనాడులో రైతుల వింత నిరసన
క్లియర్ గా ఉన్న సీఎం డీకే శివకుమార్- ఇక తేల్చుకోవాల్సింది విజయ్ నే