జంట భూకంపాలతో బెంబేలెత్తిన మరాఠ్వాడా: అర్ధరాత్రి రోడ్ల మీదికి జనం పరుగులు

మహారాష్ట్ర మరాఠ్వాడా రీజియన్ లో ఈ తెల్లవారుజామున జంట భూకంపాలు సంభవించాయి. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. పలుచోట్ల ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఏదో అనర్థం ముంచుకొస్తోందనే భయంతో వణికిపోయారు.

Advertisement

మొదటి భూకంపం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:37 నిమిషాలకు సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.6గా రికార్డయింది. రెండు గంటల తర్వాత అంటే వేకువ జామున 3:23 నిమిషాల సమయంలో మరోసారి భూమి ప్రకోపించింది. దీని తీవ్రత 4.1 గా నమోదైంది. హింగోళి సమీపంలో 19.589 అక్షాంశం, 77.156 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

Advertisement

ఈ భూప్రకంపనల తీవ్రత తక్కువే అయినప్పటికీ, గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోని పాత్రలు నేలపై పడటం, గోడ గడియారాలు, కిటికీ తలుపులు ఊగడం వంటి పరిణామాలు గమనించిన ప్రజలు తీవ్ర భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణరక్షణ కోసం మహిళలు, చిన్న పిల్లలతో సహా అందరూ రోడ్ల మీదే గడిపారు. అదృష్టవశాత్తూ ఈ ప్రకంపనల వల్ల ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరైనా గాయపడటం కానీ జరగలేదని అధికారులు ధృవీకరించారు.

గ్రామీణ, పట్టణ పరిధిలో ఎక్కడా పెద్ద పెద్ద భవనాలు దెబ్బతినడం లేదా కూలిపోవడం వంటి ఆస్తి నష్టాలు కూడా నమోదు కాలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్థానిక ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక విపత్తు నిర్వహణ సిబ్బంది తక్షణమే ప్రభావిత ప్రాంతాలను నిశితంగా పరిశీలించి పరిస్థితిని సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. నాందెడ్, అర్ధాపూర్, హడ్గావ్, హిమాయత్ నగర్, ముద్ఖేడ్, లోహా, నయీగావ్, వాస్మత్, పర్భణీ వంటి పలు ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత కనిపించింది.

Advertisement

మరాఠ్వాడా పరిధిలోని హింగోళి, దాని పరిసర జిల్లాల పరిధిలో భూగర్భంలో ఉండే చిన్న చిన్న ఫాల్ట్ లైన్స్ లో సంభవించే అంతర్గత సర్దుబాట్ల వల్ల ఇటువంటి స్వల్పకాలిక భూకంప ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ సరిహద్దులకు ఆనుకుని ఉండే నాందేడ్‌తో పాటు మరాఠ్వాడాలోని ఇతర ప్రాంతాల్లో గతంలోనూ ఇలాంటి భూ ప్రకంపనలు సంభవించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో కూడా వీటి తీవ్రత తక్కువే.

English Summary

Earthquake Update: Magnitude 4.1 Quake Jolts Nanded and Hingoli of Maharashtra, Residents Rush Outside. District administrations have urged people to remain calm and rely only on official updates. Disaster management teams are keeping a close watch for any aftershocks.