ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం 10 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ఊపందుకుంది. గడువు దగ్గరపడుతున్న కొద్దీ సిబ్బంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫామ్ లను అందిస్తోన్నారు. 2002 నాటి జాబితాలో ఉన్న పేర్లు, వివరాలను ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా ఓ కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారికోసం ఉద్దేశించిన ఆన్లైన్ ఫారం 6 దరఖాస్తులో ఓ డిక్లరేషన్ ను చేర్చింది ఈసీ. దరఖాస్తుదారులు లేదా వారి తల్లిదండ్రులు గతంలో జరిగిన 'ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్' (SIR) జాబితాలో ఉన్నారా లేదా అనే వివరాలను ఇందులో వెల్లడించాల్సి ఉంటుంది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధమైన సవరణలు ఏవీ చేయకుండానే ఆన్లైన్ ఫారంలో ఈ మార్పు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మొదటిసారి ఓటు వేసేవారు, ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేసుకునే వాళ్లు ఉపయోగించే ఫారం 6 ఆన్లైన్ వెర్షన్లో ఓ నూతన సవరణ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. దరఖాస్తుదారులు తాము గానీ లేదా తమ తల్లిదండ్రులు గానీ ఓటర్ల జాబితాలో చివరి ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అంటే.. చివరి ఎస్ఐఆర్ లో తల్లిదండ్రుల పేర్లు, వివరాలతో కూడిన డిక్లరేషన్ ను సమర్పించాలి. దీనిపై ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన ప్రకటన ఎన్నికల సంఘానికి చెందిన ఈసీఐఎన్ఈటీ (ECINET) పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫామ్ 6 దరఖాస్తుదారులు ప్రస్తుతం పోర్టల్లో ఇచ్చిన మూడు రకాల ఎంపికలలో ఒకదానిని ఎంచుకోవాలి. ఆఫ్లైన్ లో సిబ్బందికి అందజేయడానికి డౌన్లోడ్ చేసుకునే వెసలుబాటు లేదు. ఫామ్ 6ను పీడీఎఫ్ ఫార్మట్ ను డౌన్ లోడ్ కేటగిరీ ఇందులో పొందుపర్చలేదు. ఈ తాజా నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారు స్వయంగా తన పేరు, లేదా తల్లిదండ్రులు, తాతల పేర్లు గత ఎస్ఐఆర్ జాబితాలో ఉన్నాయా లేదా అని స్పష్టం చేయాలి. వీటిలో మొదటి రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకుంటే, దానికి సంబంధించిన నియోజకవర్గం అసెంబ్లీ సంఖ్య, పోలింగ్ బూత్ నంబరు, అలాగే ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబరును సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు వద్ద ఈ వివరాలేవీ కూడా సమర్పించకపోతే.. ఇక మూడో ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ మూడు ఆప్షన్లు ఇప్పుడు ఫామ్ 6లో తప్పనిసరి అయ్యాయి. నిజానికి.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 28 ప్రకారం, ఫామ్ 6లో ఎటువంటి మార్పులు చేయాలన్నా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. 2022లో ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం సమయంలో కూడా ప్రభుత్వం చట్టసవరణ చేసి, అధికారిక గెజిట్ విడుదల చేసిన తర్వాతే ఫారం 6లో మార్పు చేసింది. దీనికి విరుద్ధంగా ఈసారి ఎలాంటి గెజిట్ లేకుండానే ఈ సవరణను ప్రవేశపెట్టింది ఈసీ.