Petrol లీటరు 125 రూపాయలు! లోక్‌సభలో కేంద్రం ప్రకటన

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరకు రెక్కలొచ్చినప్పుడు దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ. 125 మార్కును దాటి సామాన్యుడి జేబుకు పెద్ద కన్నం వేసేది! కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇథనాల్ బ్లెండింగ్' విధానం భారతీయ వాహనదారులకు పెద్ద రక్షణ కవచంలా నిలిచిందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రోజువారీగా పెట్రోల్ ధరలను అత్యంత చౌకగా మార్చడమే కాకుండా.. అంతర్జాతీయ ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులను కాపాడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.

Advertisement

గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధర 135 డాలర్లకు పెరిగిన సమయంలో, ఒకవేళ ఇథనాల్ కలపకపోయి ఉంటే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ రూ. 125 వరకు పెరిగేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెట్రోల్‌లో 20 శాతం మేర స్వదేశీ ఇథనాల్‌ను కలపడం వల్ల.. ముందస్తుగా నిర్ణయించిన స్థిరమైన ధరలకే చమురు లభించిందని తెలిపింది. దీనివల్ల రూ. 125 చెల్లించాల్సిన చోట వాహనదారులు లీటరుకు కేవలం రూ. 94.77 మాత్రమే చెల్లించాల్సి వచ్చిందని వివరించింది.

Advertisement

E20 Petrol: మైలేజ్ తగ్గుతోందా? రాజ్యసభలో గడ్కరీ కీలక ప్రకటన!

ఇంజిన్ల లైఫ్ తగ్గదు.. మైలేజీపై అపోహలొద్దు!

ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల వాహనాల ఇంజిన్‌ ఖరాబవుతుందని, మైలేజీ తగ్గుతుందని వస్తున్న వార్తలపై కేంద్రం గట్టిగానే స్పందించింది. నీతి ఆయోగ్, ఆటోమొబైల్ సంస్థలు (SIAM), ఎఆర్‌ఏఐ (ARAI) వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలతో సుదీర్ఘంగా పరిశోధనలు నిర్వహించిన తర్వాతే 'ఈ20 (E20)' పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి లోక్‌సభలో స్పష్టం చేశారు. ఇథనాల్ వాడకం వల్ల ఇంజిన్‌లు పాడవుతాయనడానికి లేదా వాహనాల ఆయుష్షు తగ్గుతుందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని శాస్త్రీయంగా రుజువైందని వెల్లడించారు.

Advertisement
E20 Petrol: తిరుగుబాటు మొదలైంది, ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్!

విదేశాలకు కాకుండా.. స్వదేశంలోనే సంపద!

ఇథనాల్ విధానం అనేది పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఇచ్చే సబ్సిడీ కాదని, అది భారతీయ ఇంధన రంగానికి ఒక 'ఇన్సూరెన్స్ పాలసీ' లాంటిదని కేంద్రం వ్యాఖ్యానించింది. ముడిచమురు దిగుమతుల కోసం వేల కోట్లు విదేశాలకు పంపే బదులు, దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను ప్రోత్సహించడం వల్ల ఆ డబ్బు మన దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఉంటుందని తెలిపింది. సంక్షోభ సమయంలో ఈ విధానం తన సత్తాను నిరూపించుకుందని, భవిష్యత్తులో కూడా దేశ ఇంధన భద్రతను పటిష్టం చేయడంలో ఇథనాల్ దివ్యౌషధంగా పనిచేస్తుందని పెట్రోలియం శాఖ నొక్కి చెప్పింది.

English Summary

The Petroleum Ministry clarified that petrol prices in Delhi would have crossed Rs 125 per litre during crude oil spikes without ethanol blending, which protected consumers at Rs 94.77 per litre.