దేశంలోని ప్రముఖ విమాయాన సంస్థ, టాటా గ్రూప్స్ కు చెందిన ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) గా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి తెఓల్డే గెబ్రెమరియమ్ ను నియమించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నియామకానికి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇక ఎయిర్ ఇండియా సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన క్యాంప్ బెల్ విల్సన్ గతంలోనే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఎయిర్ ఇండియా బోర్డ్ కమిటీ ఈ మేరకు అనుభవజ్ఞులైన, చురుకైన, నమ్మకమైన అధికారులను ప్రపంచవ్యాప్తంగా జల్లెడ పట్టింది. లార్జ్ స్కేల్ ఎయిర్ లైన్స్ లో ట్రాక్ రికార్డు, అనుభవం, ఆపరేషనల్ ఎక్స్ లెన్స్, సేఫ్టీ, సర్వీస్, ప్రాఫిటబుల్ ఎక్స్ పాన్షన్ తదితర అర్హతలు ఉన్న వారిని గుర్తించింది. చివరగా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతిగా విధులు నిర్వర్తించిన గెబ్రెమరియమ్ ను సెలెక్ట్ చేసింది.
ఈ నియామకంపై ఎయిర్ ఇండియా బోర్డు మాట్లాడుతూ.. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో దాదాపు దశాబ్దం పాటు అనుభవం ఉన్న గెబ్రెమరియమ్ ను నియమించడం జరిగిందని పేర్కొంది. ఈయన పదవీకాలంలో ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ నాలుగింతలు లాభాలను చూసిందని.. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా మూడింతలు దాటిందని స్పష్టం చేసింది.
33 వేల అడుగుల నుంచి ఉన్నట్టుండి 300 అడుగులు కిందికి జారిన ఎయిరిండియా విమానం
తద్వారా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ను ఆఫ్రికాలోనే అతిపెద్ద, అత్యధిక లాభదాయక, స్థిరత్వం కలిగిన ఎయిర్ లైన్స్ గా మారడంలో గెబ్రెమరియమ్ కీలక పాత్ర పోషించినట్లు ఎయిర్ ఇండియా బోర్డు సర్వేలో వెల్లడైంది. అందుకే ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీగా గెబ్రెమరియమ్ ను నియామకం చేపట్టినట్లు ఎయిర్ ఇండియా బోర్డు కమిటీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ లో తన పదవికి రాజీనామా చేసిన క్యాంప్ బెల్ విల్సన్ స్థానంలో గెబ్రెమరియమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే గెబ్రెమరియమ్ అనుభవం సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని టాటా సన్స్, ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు.