అయోధ్య రాములోరి చెంత చీకటి కోణం- చివరికి రామచరిత్ మానస్ కూడా మాయం చేశారు

అయోధ్య రామ మందిర శోభను మసకబార్చే మరో వివాదస్పద అంశం వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల విలువ చేసే విరాళాల చోరీ ఘటన సద్దుమణగకముందే మరో భారీ ఉదంతం చెలరేగింది. రాముడి మీద భక్తితో ఆలయానికి సమర్పించిన అరుదైన రామచరిత మానస్ ఇప్పుడు కనిపించట్లేదు. 24 క్యారెట్ల బంగారపు రేకులపై రామచరిత్ మానస్ ను రాసిన పుస్తకం ఇది. దీని విలువ అయిదు కోట్ల రూపాయల పైమాటే. దీని బరువు 125 కేజీలు.

Advertisement

ఇది ఆలయ ప్రాంగణం నుంచి అదృశ్యమైందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి లక్ష్మీనారాయణన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన మూడు నెలల తర్వాత.. అంటే 2024 ఏప్రిల్ లో ఆయన దీన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు. ప్రారంభంలో దీన్ని భక్తులు తిలకించేలా ఉంచారు. డిసెంబర్ నుంచి ఆ పవిత్ర గ్రంథం కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో ట్రస్ట్ వైఖరిపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

Advertisement

ఈ అత్యంత పవిత్రమైన ప్రతిని యథాస్థానంలో భక్తుల దర్శనార్థం తిరిగి ఉంచాలని తాను రామ మందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ను పలుమార్లు కోరినట్లు లక్ష్మీనారాయణన్ పేర్కొన్నారు. ఆయన ఈ అభ్యర్థనను ఎంతమాత్రం ఖాతరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయానికి భక్తులు సమర్పించే ప్రతి అపురూప కానుకనూ అక్కడ ప్రదర్శించడం సాధ్యం కాదని చంపత్ రాయ్ తనకు నిర్మొహమాటంగా సమాధానమిచ్చారని వెల్లడించారు.

ఈ అపురూప రామచరిత మానస్ గ్రంథం వెనుక తమ దశాబ్దాల నాటి అకుంఠిత భక్తి దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మహోన్నతమైన ప్రతి కోసం తన దివంగత తల్లి తన జీవితంలో దాదాపు 18 ఏళ్ల పాటు రామనామాన్ని రాస్తూనే గడిపారని లక్ష్మీనారాయణన్ గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఎన్నో దశాబ్దాలుగా రామజన్మభూమి ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి వెళ్లిన మొట్టమొదటి ఇటుక తన మామగారి నివాసం నుంచే సేకరించారని స్పష్టం చేశారు.

Advertisement

రిటైర్మెంట్ తర్వాత తన సాధారణ పెన్షన్ జీవితానికి సరిపోతుందని భావించి, భగవంతుడు ఇచ్చిన సంపదనంతా రాముడి సేవకే అంకితం చేయాలని నిశ్చయించుకున్నానని లక్ష్మీనారాయణన్ తెలిపారు. తన సంపాదనతో రామచరిత్ మానస్ బంగారు, వెండి ప్రతిని చేయించినట్లు వివరించారు. రామచరిత మానస్ కనిపించకుండా పోవడం వెనుక మాత్రమే కాకుండా ఇతర విరాళాల వ్యవహారాల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమిన ఆయన వ్యాఖ్యానించారు.

English Summary

Gold Plated Ramcharitmanas Worth Rs 5 Crore Allegedly Missing from Ayodhya Ram Mandir Since December. He said he feels blessed by the Lord for allowing him to retire, and after retirement, it was time for him to dedicate some of his earnings back to Lord Ram.