మొదటిసారి దేశం దాటనున్న ఐఐఎం బెంగళూరు- నూతన క్యాంపస్ ప్రకటించిన ప్రధాని మోదీ

ప్రతిష్ఠాత్మక అత్యున్నత విద్యాసంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM Bengaluru) బెంగళూరు.. మొదటిసారిగా దేశం దాటబోతోంది. ఇండోనేషియాలో దీని క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ఆయన ఈ రెండు దేశాల మధ్య సాంకేతిక, విద్యా సంబంధాలలో భాగంగా ఈ క్యాంపస్ ను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు.

Advertisement

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్స్ వంటి అత్యాధునిక రంగాలలో పరస్పర సహకారానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయి. యువత సాధికారత, సాంకేతిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రూపొందించారు.

Advertisement

జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ప్రధాని మోదీ జరిపిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయాలను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాయింట్ ప్రెస్ మీట్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతపై ఇరు దేశాల యువతకు సహజంగానే అద్భుతమైన అవగాహన ఉందని, దీన్ని మరింత ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.

ఇందులో భాగంగా ఐఐఎం- బెంగళూరు క్యాంపస్‌ను ఇండోనేషియాలో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆగ్నేయాసియా దేశాల కూటమి సభ్య దేశాల విద్యార్థులకు అత్యున్నత స్థాయి మేనేజ్మెంట్ కోర్సుల్లో అవకాశాలను అందించడానికి ఈ క్యాంపస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యా రంగంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆగ్రోటెక్నాలజీ రంగంలో ఇరు దేశాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోనున్నట్లు చెప్పారు. స్టార్టప్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని తెలిపారు.

Advertisement

డిజిటల్ విప్లవంతో పాటు అంతరిక్ష రంగంలోనూ ఉమ్మడి పరిశోధనలను ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా రెండు దేశాలు నిర్ణయించాయి. గత కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష రంగంలో కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా చర్యలు ఉండబోతోన్నాయి. అంతరిక్ష రంగంలో ఉమ్మడి పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, శాస్త్రవేత్తల సామర్థ్య పెంపుదల వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

English Summary

IIM Bengaluru Campus in Indonesia Announced by PM Modi to Boost Tech and Education Pacts in AI, Space Research. To anchor this deepening partnership, the two democracies announced the establishment of a premier Indian management campus in the Southeast Asian.